పెనుబల్లి, జనవరి 11: సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన ముఠాను ఖమ్మంజిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 18మంది నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఖమ్మంజిల్లా పెనుబల్లి పోలీస్స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. గత నెల 24వ తేదీన సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగ సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ విచారణలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన పేరుతో వల విసిరి ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడా భానుప్రకాష్, మేడా సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా రూ.547 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టినట్లు గుర్తించారు. నిందితులు వికాస్ చౌదరి, మనోజ్కళ్యాణ్ల కుటుంబసభ్యులు, అనుచరుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలించగా దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి.
మనోజ్కళ్యాణ్ బ్యాంకు ఖాతాలో రూ.114.18 కోట్లు, అతడి భార్య మేడా భానుప్రియకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.45.62 కోట్లు, మనోజ్కళ్యాణ్ బావమరిది మేడా సతీష్ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ.81.72 కోట్లు, కరీంనగర్కు చెందిన తాటికొండ రాజు అనే వ్యక్తికి చెందిన నరసింహా కిరాణం అండ్ డెయిరీ ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్ల చొప్పున లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

సత్తుపల్లి పరిసర గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులను ఉద్యోగాల కల్పన పేరుతో పిలిపించుకుని, వారికి ఉద్యోగం ఇచ్చి, వారితో ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాను తెరిపించి, ఆయా అకౌంట్లలో క్రెడెన్షియల్స్ను తీసుకుని నిందితులు కోట్ల రూపాయల సైబర్ నేరాల సొత్తును జమ చేయడానికి వినియోగించారు. ఈ నేరస్తులు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జతకట్టి విదేశాల్లో కాల్సెంటర్లు నిర్వహిస్తూ వాటి ద్వారా దేశంలోని పౌరులను పెట్టుబడి, మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మారెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసగించారు.
ఎవరైనా బాధితుడు వారి మాటలకు ఆకర్షించబడితే అతడిని వారి టెలిగ్రామ్ గ్రూపులో సభ్యుడిగా చేర్చి, తర్వాత వారికి మోసపూరిత లింకులు పంపి వారి అకౌంట్లో నుంచి డబ్బులను ఖాళీ చేయడం చేసేవారు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన నేరపు సొత్తును వీరు మొదట వీరి ఏజెంట్ల ద్వారా తెరిపించిన బ్యాంక్ అకౌంట్లోకి బదిలాయించేవారు. తర్వాత ఆ సొమ్మును కొన్ని కరెంట్ అకౌంట్లోకి మార్చి, చివరగా తమ పర్సనల్ అకౌంట్లోకి చేర్చేవారు. యూఎస్ డాలర్స్, క్రిప్టో కరెన్సీ రూపంలోకి కూడా డబ్బులు మార్చినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ సైబర్ నేరగాళ్లకు సహకరించిన సదాశివపాలెం, సీతారాంపురం, రామానగరం, తుమ్మూరు గ్రామాలకు చెందిన జుంజునూరి శివకృష్ణ, వడ్లమూడి నరేంద్ర, మల్లాది శివ, సాధు పవన సందీప్, సాదు సంధ్య, సాధు లేఖ,
లింగపాలెం గ్రామానికి చెందిన జొన్నాదుల తిరుమల, కందుకూరి మణికంఠ, తన్నీరు మహేష్, గోళ్లమూడి నాగముఖేష్, కంచపోగు శ్రీనివాస్, రాయల అజయ్కుమార్, రాయల గోపి, పల్లా గణేష్, రాయల గోపీచంద్, కందుకూరి జగదీష్, కరీంగనర్కు చెందిన తాటికొండ రాజును ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోట్రు ప్రవీణ్ను ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. సైబర్క్రైం పెద్దనేరమని, సైబర్ నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ఏసీపీ వసుంధర, సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.