వైరాలోని మిల్లులో ధాన్యం మిల్లింగ్ చేసిన శాస్త్రవేత్తలు
నెల రోజులు పర్యటించి 10 మిల్లుల నుంచి నమూనా సేకరణ
సీఎం కేసీఆర్కు త్వరలో నివేదిక
ఖమ్మం, జూన్ 25: జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేశారు. పలు మిల్లుల నుంచి శాంపిళ్లు సేకరించారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విధానంలో తీవ్రమైన అవకతవకలు ఉన్నాయని, నూకల శాతం అధికంగా వస్తోందని కేంద్రం ఆరోపించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి ధాన్యం, సీఎంఆర్ విధానాల్లో వాస్తవ విషయాలను కేంద్రం ముందు పెట్టేందుకు నిర్ణయించింది. సీఎంఆర్ ప్రకారం క్వింటా ధాన్యానికి మిల్లర్లు 67 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు వాస్తవంగా క్వింటా ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేస్తే ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయి? ఎన్ని కిలోల నూకలు వస్తున్నాయి? అనే విషయాలను తెలుసుకునేందుకు మైసూరుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలతో తెలంగాణలోని రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేయిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఒక్కో బృందానికి ఐదు జిల్లాలను కేటాయించారు. ఇందులో భాగంగా ఖమ్మం, కామారెడ్డి, పిద్దిపేట, వరంగల్, నల్గొండ జిల్లాలకు కేటాయించిన శాస్త్రవేత్తలు గత నెలలో జిల్లాకు వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది మిల్లులో శాంపిళ్లను సేకరించారు. ఇందులో భాగంగా శనివారం వైరాలోని కస్తూరి రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యాన్ని పరిశీలించారు. శాంపిల్స్ పరిశీలన అనంతరం నివేదికను సీఎం కేసీఆర్కు అందజేయనున్నారు. వైరాలో జరిగిన శాంపిల్స్ సేకరణలో మైసూరుకు చెందిన సీఎఫ్టీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శృతిపాండే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హెడ్ ఆఫీస్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు జీ.సైదులు, జీసీ మల్లారెడ్డి, జి.రామచంద్రమ్, సివిల్ సప్లయి జిల్లా మేనేజర్ జీ.సోములు, సివిల్ సప్లయి అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) వీ.నిర్సంహారావు, డీఎస్వో రాజేందర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మా రాజేశ్వరరావు, వివిధ రైస్ మిల్లుల యజమానులు నంబూరి శ్రీను, బాలకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.