ఇతర పంటల సాగుకు రైతుల మొగ్గు
ప్రధాన పంటగా మక్క
పుష్కలంగా ఉద్యాన పంటల సాగు
గణనీయంగా తగ్గిన వరి సాగు విస్తీర్ణం
అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు, విత్తనాలు
సకాలంలో చేతికందిన పెట్టుబడి సాయం
ఖమ్మం, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;రైతుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. అధునాతన పద్ధతుల్లో సాగు చేస్తూ వైవిధ్యమైన పంటలు పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేస్తూ లాభాల దిగుబడి సాధిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని సూచించడంతో రైతులు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అపరాలు, మక్క, ఉద్యాన పంటల సాగు చేపట్టారు. నేటివరకు జిల్లా వ్యాప్తంగా 1.34 లక్షల ఎకరాల్లో సాగు కాగా.. 63 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. వరి 61,643 ఎకరాలు, జొన్న 122 ఎకరాలు, పెసర 2,459 ఎకరాలు, మినుము 1,060 ఎకరాలు వీటితోపాటు వేరుశనగ 1,757 ఎకరాలు, చెరుకు 2,542 ఎకరాలు, పొద్దుతిరుగుడు 116 ఎకరాలు, ఇతర పంటలు 4,805 ఎకరాల్లో సాగైంది.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేయాలని సీఎం కేసీఆర్ ఇతర పంటల సాగు విధానం ప్రకటించారు. ఈ మేరకు అధికారులు అన్నదాతలకు అవగాహన కల్పించారు. దీంతో ఒకే రకమైన పంట కాకుండా బహుళపంటల సాగు చేపట్టారు. యాసంగి వచ్చేసరికి నియంత్రిత సాగు విధానం ప్రభుత్వం అమలు చేయకపోయినా సీఎం కేసీఆర్ చూపిన మార్గాన్ని రైతులు మరోసారి ఆచరణలో పెట్టారు. దీంతో వరికి బదులు మక్కతోపాటు చిరుధాన్యాలు, అపరాల సాగు ఆశించిన మేర జరిగిందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా యాసంగి సీజన్లో ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్లు, పూల సాగు భారీగా పెరిగింది. ప్రభుత్వం సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించింది. రైతులకు పెట్టుబడి సొమ్మువారి ఖాతాలో వేయడంతో ఆనందంగా సాగకు శ్రీకారం చుట్టారు. చెరువులు, కుంటల్లో సాగునీరు సమృద్ధిగా ఉండడం, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నిరంతరాయంగా నీరు విడుదల కావడంతో యాసంగి సాగు విజయవంతంగా కొనసాగుతున్నది.
పెట్టుబడి సాయం
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. జిల్లావ్యాప్తంగా 3,16,422 మంది రైతులకు రూ.362.28 కోట్ల మంజూరు చేసింది. నెలరోజుల వ్యవధిలోనే ప్రభుత్వం 99శాతం సొమ్మును రైతుల అకౌంట్లో జమ చేసింది. కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి రైతుబంధు పంపిణీ చేసింది. దీంతో రైతులు ఉత్సాహంగా సాగులోకి దిగారు.
ఉవ్వెత్తున ఉద్యాన పంటల సాగు
ఏటా యాసంగి సీజన్ వచ్చింటే ఆకుకూరలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటేవి. ఈ ఏడాది ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. వరికి బదులు మక్క, అపరాల సాగుతోపాటు అనేక మంది రైతులు ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యమిచ్చారు. 28,532 మంది రైతులు 88,925 ఎకరాల్లో ఆకుకూరలు, బీర, పొట్లకాయ, ఇతర దుంపలు సంబంధించిన సాగు చేశారు. యాసంగి సీజన్లో మరో 7,100 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేపట్టారు. మామిడి, నిమ్మ, బొప్పాయి, ఇతర పండ్ల తోటలకు సంబంధించి 65 మంది రైతులు 190 ఎకరాల్లో సాగు చేపట్టారు. 404 మంది రైతులు 1,073 ఎకరాల్లో జామ, అరటి, పుచ్చకాయతోటలు వేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో నేటి వరకు సుమారు 97,738 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. ఇంత భారీగా ఉద్యాన పంటల సాగు జరగడం ఇదే తొలిసారి.
డిమాండ్ ఉన్న పంటలు వేయాలి
రైతులు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు చేపట్టాలి. నేటి వరకు సుమారు లక్ష ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలతోటల సాగు చేపట్టారు. యాసంగి సీజన్లో చేపట్టాల్సిన పంటలపై ఉద్యాన అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరికి బదులు ఇతర పంటల సాగు చేపట్టాలనే ఉద్దేశంతో రైతులు ఉద్యాన పంటల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
-జీనుగు మరియన్న, జిల్లా ఇన్చార్జి ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి