జిల్లాలో మిర్చి కల్లాలు జోరందుకున్నాయి. గత నెల నుంచే తోటల్లో మిర్చి కోతలు మొదలుకాగా.. ఇప్పుడు ఆ పంటంతా కల్లాల్లోకి చేరుకుంటోంది. వాణిజ్య పంటల్లో ముఖ్యమైనదిగా ఉన్న ఈ మిర్చి పంటను జిల్లా రైతులు ఈ ఏడాది 70 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఖర్చులు అధికంగానే ఉన్నా ఆదాయం కూడా ఇదే రీతిలో ఉంటుండడంతో అధిక మంది రైతులు ఈ పంట సాగు కోసం ఆసక్తి చూపిస్తున్నారు. డిసెంబర్ నుంచి మొదలయ్యే మిర్చి తోటల పనులు ఏప్రిల్ వరకు ఉంటాయి. అయితే, గతంలో రికార్డు స్థాయిలో ఎకరాకు 30 క్వింటాళ్ల వరకూ మిర్చి దిగుబడి రాగా.. తెగుళ్ల వంటి కారణాలతో ఈసారి కాస్త తగ్గింది.
కూసుమంచి, జనవరి 5 : వనరులు పుష్కలంగా ఉండడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, ధరలు కూడా అధికంగా పలుకుతుండడం వంటి కారణాలతో జిల్లా రైతులు ఏటికేడు మిర్చి సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. జూలూరుపాడు, కూసుమంచి, తిరుమలాయపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఈ పంట అత్యధికంగా సాగవుతోంది. తల్లాడ, నేలకొండపల్లి, కొణిజర్ల, ఏన్కూరు, ఎర్రుపాలెం, కామేపల్లి వంటి మండలాల్లో సాగర్ ఆయకట్టుకు నీరు రాకపోవడంతో ఆ ప్రాంతాల్లోని కొందరు రైతులు మాత్రమే మిర్చి తోటలవైపు వెళ్లారు.
మిర్చిలో ఎకరానికి సగటున 15 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. నిరుడైతే 20-30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే.. క్వింటాకు రూ.20 వేలకు పైనే ధర పలుకుతుండడం, ఎకరాకు రూ.3 లక్షలకు పైగానే ఆదాయం వస్తుండడం, పెట్టుబడులు పోను రూ.లక్ష వరకు మిగులుతుండడం వంటి కారణాలతో ఎక్కువ మంది రైతులు ఈ పంటను సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. వైరస్ల వంటివి సోకినా తగిన సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
మిర్చి తోటలు ఏరడానికి పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు వస్తున్నారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు చేరుకొని పనుల్లో నిమగ్నమయ్యారు. ఐదు నెలలపాటు ఇక్కడే ఉండి పనులు ముగించుకొని వెళ్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల కూలీలకు అక్కడ పనులు దొరకకపోవడంతో గత ఐదారేళ్లుగా ఇక్కడికి వలస వచ్చి మిర్చి తోటల్లో పనులు చేస్తున్నారు. మిర్చి ఏరినందుకుగాను కేజీకి రూ.10 చొప్పున ఇక్కడి రైతులు కూలి ఇస్తుండడంతో వారంతా రైతుల మిర్చి తోటల వద్దనే గుడారాలు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు. అక్కడ పనులు పూర్తయితే మరో ప్రాంతానికి వెళ్తున్నారు. అయితే.. పాలేరు నియోజకవర్గంలో ముఖ్యంగా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో ఈసారి రైతులు మిర్చిని అధిక విస్తీర్ణంలోనే సాగు చేశారు. దిగుబడులు కూడా గణనీయంగానే వచ్చాయి. జిల్లాలో నిరుడు 95 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు కాగా.. తెగుళ్ల కారణంగా ఈ ఏడాది 70 వేల ఎకరాల్లోనే సాగవుతోంది. కానీ.. గడిచిన ఐదారేళ్లుగా పరిశీలిస్తే మిర్చిసాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది.
నేను ఈసారి 11 ఎకరాల్లో మిర్చి తోట వేశాను. ఇప్పటివరకు 175 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా 150 క్వింటాళ్ల వరకూ వస్తుంది. మార్కెట్లో మంచి ధర ఉండడంతో 55 క్వింటాళ్లను విక్రయించాను. మిగిలిన పంటను కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. నిరుడు 5 ఎకరాల్లో తోట వేశాను. కానీ.. దిగుబడి పెద్దగా రాలేదు. ఈసారి మాత్రం ఎకరానికి కనీసం 30 క్వింటాళ్ల వరకూ వచ్చింది. దీంతో పెట్టుబడి పోను ఎకరానికి సుమారు రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుంది.