యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సొమ్ము పంపిణీ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరా లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి రైతుల ఖాతాలకు అనుసంధానం చేసిన మొబైల్ నంబర్లకు సమాచారం రావడం ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో 1.03 లక్షల మంది రైతులకు పంటల పెట్టుబడి సాయం అందింది. భద్రాద్రి జిల్లాలో 30,905 మంది రైతులకువారి ఖాతాల్లో సొమ్ము జమ అయింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సాగు సస్యశ్యామలంగా మారిందని కీర్తిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటామని ముక్తకంఠంతో పేర్కొన్నారు.
– నమస్తే నెట్వర్క్
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 28: యాసంగి సీజన్ రైతుబంధు (పంటల పెట్టుబడి) సొమ్ము పంపిణీ బుధవారం నుంచి ప్రారంభమైంది. పథకం మొదలైనప్పటి నుంచి కొనసాగుతున్న పంటల పెట్టుబడి సాయం అందజేతలో ఇది పదో విడత. ఈ విడతలో తొలిరోజైన బుధవారం ఎకరం లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి రైతుల ఖాతాలకు అనుసంధానం చేసిన సెల్ఫోన్ నెంబర్లకు సమాచారం రావడం ప్రారంభమైంది.
గంటల వ్యవధిలోనే జిల్లా వ్యాప్తంగా లక్షమంది రైతులకు పంటల పెట్టుబడి అందింది. ఇప్పటి వరకూ రైతుబంధు సాయం కోసం ఎదురు చూసిన రైతులు ఈ సాయం తమ ఖాతాల్లో జమ అయినట్లు సంక్షిప్త సందేశం రాగానే.. వెంటనే బ్యాంకులకు వెళ్లి సర్కారు పంపిన సాయాన్ని విత్ డా చేసుకొని విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు పయనమయ్యారు. ఈ యాసంగిలో ఎకరానికి రూ.5 వేల చొప్పున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,28,491 మంది రైతులకు గాను రూ.363.44 కోట్లను సదరు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. అందులో భాగంగానే తొలిరోజున ఎకరంలోపు భూమి కలిగిన 1,03,442 మంది రైతులకు రూ.33.62 కోట్లను జమ చేశారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా బ్యాంకుల్లో జమ అయిన పంటల పెట్టుబడి సాయాన్ని ఆయా గ్రామాల రైతులు విత్డ్రా చేసుకున్నారు. మరో పక్షంరోజులపాటు రైతుబంధు పంటల సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. చిన్న, సన్నకారు రైతుల నుంచి మొదలుకొని అధిక విస్తీర్ణంలో వ్యవసాయ భూములు కలిగిన రైతులకు వరకూ ప్రాధాన్య క్రమంలో రైతుబంధు పంపిణీ జరిగే విధంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. బుధవారం మొదలైన ఈ పంపిణీ కార్యక్రమం వచ్చే నెల 15 వరకు పట్టాదారు పాసు పుస్తకం కలిగిన ప్రతి రైతు ఖాతాలోనూ పంటల పెట్టుబడి సాయం జమ కానుంది.
సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రైతుబంధు పథకం ద్వారా అందుతున్న పంటల పెట్టుబడి సాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అన్నదాతలందరూ సకాలంలో తమ పంటలను సాగుచేసుకోవాలనే, అప్పులపాలు కావొద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. బుధవారం నుంచి జమ అవుతున్న ఈ పంటల పెట్టుబడి సాయాన్ని రైతులందరూ అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, ఇతర సాగు పనుల కోసం ఉపయోగించుకోవాలి. యాసంగిలో ఆరుతడి, అపరాలు, నూనె గింజల పంటలు సాగు చేస్తే ఆశించిన లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
-ఎం.విజయనిర్మల, డీఏవో, ఖమ్మం
ఎకరం భూమికి రూ.5 వేలు జమ అయ్యాయి..
రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే బుధవారం నాకు రైతుబంధు పంటల పెట్టుబడి సాయం అందింది. నాకు ఎకరం సాగు భూమి ఉంది. ఇందుకుగాను ఈ రోజు నా బ్యాంకు ఖాతాలో రూ.5 వేల రైతుబంధు సాయం జమ అయింది. యాసంగి పనులు ప్రారంభిస్తున్న ఈ సమయంలోనే సీఎం కేసీఆర్ మాకు రైతుబంధు సాయాని అందించడం చాలా సంతోషంగా ఉంది. తాను ఉన్నంత వరకూ రైతుబంధు ఆగబోదంటూ సీఎం కేసీఆర్ చెబుతండడం మాకు ఎంతో ధైర్యాన్నిస్తోంది. ఆయన ఉన్నంత వరకూ మేము నిశ్చంతగా సేద్యం చేసుకుంటాం.
-దరంసోత్ బుజ్జి, మహిళా రైతు, క్రాంతినగర్, కొణిజర్ల, ఖమ్మం
యాసంగి పనులు ప్రారంభం కాగానే సాయం అందింది..
పంటలు సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వమే అందిస్తుండడం గొప్ప విషయం. ఇలాంటి ఆలోచనలో ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ చేయలేదు. మాకున్న ఎకరం భూమిలో ఈ మధ్యే యాసంగి పనులు మొదలు పెట్టాను. ఇంతలోనే సీఎం కేసీఆర్ మాకు రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. ఉదయం నా బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.5 వేలను విత్ డ్రా చేసుకొని తెచ్చుకున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల కష్టాలు తెలుసుకాబట్టే సీజన్కు ముందుగానే పంటల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు.
-డీ.నాగేశ్వరరావు, యువ రైతు, క్రాంతినగర్, కొణిజర్ల, ఖమ్మం
రైతుబంధు జమతో వ్యాపారుల చుట్టూ తిరగడం లేదు..
తెలంగాణ ప్రభుత్వంలో మా రైతుల బతుకులు మారింది. ఉమ్మడి పాలనలో ఉన్నప్పుడు పంటల సీజన్ వచ్చిందంటే చాలు.. పెట్టుబడి సాయానికి అప్పుల కోసం వ్యాపారుల వద్దకు పరుగెత్తే వాళ్లం. వడ్డీ ఎక్కువైనా తెచ్చుకోక తప్పేది కాదు. ఇప్పుడు తెలంగాణలో రెండు సీజన్లలోనూ పంటల పెట్టుబడిని ప్రభుత్వమే రైతుబంధు ద్వారా అందిస్తోంది. ఇంకా మేమెందుకు వ్యాపారుల చుట్టూ తిరుగుతాం. నాకున్న ఎకరానికి రూ.5 వేల సాయం ఇవ్వాళే అందింది. అన్నదాతల గురించి సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన ఎంతో గొప్పది.
-కొత్తా రాములు, రైతు, దంతెనం, దుమ్ముగూడెం, భద్రాద్రి
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకంతో ఈ ఏడాది యాసంగి సాగు కోసం నాకున్న ఎకరానికి గాను రూ.5 వేల పంటల పెట్టుబడి సాయం అందింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఈ పథకంతో ఎందరో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. మా రైతుల కష్టాలు తీర్చేందుకు రైతుబంధును అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-బొక్కా రాజేశ్వరి, మహిళా రైతు, ముచ్చవరం, కల్లూరు
రైతుబంధు రైతులకు వరం..
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులందరికీ వరం లాంటిది. సన్న, చిన్నకారు రైతులకు ముందస్తుగా యాసంగి పంట సాయం ప్రారంభమైంది. యాసంగి కోసం రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు ద్వారా పంటల పెట్టుబడి సాయం అందించడం హర్షణీయం. వ్యవసాయంలో రైతులు ఎలాంటి కష్టాలు పడుతుంటారో తెలుసు కాబట్టే సీఎం కేసీఆర్ ఈ రైతుబంధు పథకాన్ని తెచ్చారు.
-చలసాని కృష్ణమోహన్రావు, రైతు, ముచ్చవరం, కల్లూరు
భద్రాద్రి జిల్లాలో తొలిరోజు 30,905 మందికి రైతుబంధ
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,34,370 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.204 కోట్ల రైతుబంధు సొమ్ము జమ కావాల్సి ఉండగా బుధవారం తొలిరోజు ఎకరాలోపు ఉన్న 30,905 మంది రైతుల ఖాతాల్లో రూ.10.67 కోట్లు జమయ్యాయి. సొమ్ములు అందుకున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు.