కూసుమంచి/ తిరుమలాయపాలెం/ముదిగొండ, మార్చి 24: లౌకిక శక్తులన్నింటినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ‘జన చైతన్య యాత్ర’లో ఆయన మాట్లాడారు. బీజేపీ వామపక్ష పార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. సంవత్సరంలో యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ గడిచిన తొమ్మిదేళ్లలో మూడు కోట్ల ఉద్యోగాలను ఊడగొట్టిందని మండిపడ్డారు.
నల్లచట్టాలతో వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేయాలని యత్నించిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాకే దేశంలో మత విద్వేషాలు పెరుగుతున్నాయన్నారు. జన చైతన్యయాత్రకు సంఘీభావం తెలిపారు. సీపీఎం నేతలు పోతినేని సుదర్శన్, మల్లు లక్ష్మి, నున్నా నాగేశ్వరరావు, వెంకట్, బండి రమేష్, యర్రా శ్రీకాంత్, యర్రా శ్రీను, కొమ్ము శ్రీను, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ పాల్గొన్నారు.