మామిళ్లగూడెం, మార్చి 20: పార్లమెంటు ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కీలకమైన ఎన్నికల సమయంలో ముందు జాగ్రత్తగా హిస్టరీ షీటర్లు, చెడు నడత కలిగిన రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు.
ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ నగదు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టీ, 15 ఎస్ఎస్టీ, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినందున వాటిల్లో 24/7 నిఘా ఉండాలని ఆదేశించారు.
అదే సమయంలో సాధారణ ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు రానీయొద్దని సూచించారు. క్రిటికల్, వనరబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపులో ఎన్నికల మార్గదర్శకాల పాటించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. లోపాలకు తావు లేకుండా మార్గదర్శకాలు పాటిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిని మూడు నుంచి నాలుగు సెక్టార్లుగా విభజించి ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లకు బాధ్యతలు అప్పగించేందుకు వీలుగా మ్యాపింగ్ సిద్ధం చేయాలని సూచించారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు, ఏఎస్పీ అవినాశ్కుమార్ పాల్గొన్నారు.