కారేపల్లి, ఆగస్టు 4 : కారేపల్లి పోలీస్ స్టేషన్ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్కు చేరుకున్న సిపి సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను సందర్శించారు. వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. అనంతరం పరిసర ప్రాంతాలను కలియతిరిగి చూశారు. పోలీస్ కోటర్స్ వద్దకు చేరుకొని భవనాలను పరిశీలించారు. శిథిలావస్థ లో ఉన్న భవనాలను కూల్చివేయాలని సీఐ నునావత్ సాగర్ను ఆదేశించారు. అదేవిధంగా స్టేషన్లో పలు రికార్డులను తనిఖీ చేసి పెండింగ్లో ఉన్న కేసు వివరాలను సీఐ సాగర్, ఎస్ఐ బైరు గోపీలను అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించి, రికార్డుల నిర్వహణపై తగిన సూచనలు చేశారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారిస్తూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలని, ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలతో మరింత సత్సంబంధాలు పెంచుకోవాలని, ముఖ్యంగా యువతకు సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.సిపి వెంట ఏసిపి తిరుపతిరెడ్డి, కామేపల్లి ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.