మామిళ్లగూడెం, ఫిబ్రవరి 2: పోలీసు శాఖలో విధులు నిర్వహించే సిబ్బందికి వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలన ఎంతో ముఖ్యమని సీపీ సునీల్దత్ పేర్కొన్నారు. సిటీ ఏఆర్ సిబ్బంది 15 రోజుల మొబలైజేషన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన పరేడ్లో ఆయన మాట్లాడారు. శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు సహాయకారిగా ఉండే ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ విభాగానికి సమస్య నిలువరించే సమయస్ఫూర్తి ఉండాలని అన్నారు. సిబ్బందికి శారీరక వ్యాయామం, ఆయుధాల పనితీరు, ఉపయోగాలు, స్వార్డ్ డ్రిల్ మొదలైన అంశాలపై 15 రోజులుగా ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో శిక్షణ ఇచ్చామన్నారు. దీని ద్వారా సిబ్బందిలో క్రమశిక్షణ భరితమైన విధినిర్వహణను అలవర్చుకొని ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో నేరుగా చర్చిస్తూ శాఖాపరమైన సమస్యల గురించి తెలుసుకుంటామన్నారు. కాగా, ఫైరింగ్ ప్రాక్టీస్లో ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి సీపీ సునీల్దత్ జ్ఞాపికను అందజేశారు. ఏడీసీపీలు, ఏసీపీలు ప్రసాద్రావు, కుమారస్వామి, నర్సయ్య, సుశీల్సింగ్, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేశ్, తిరుపతి, అప్పలనాయుడు పాల్గొన్నారు.
బాలలకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో తమ శాఖ నిరంతరం కృషిచేస్తోందని సీపీ పేర్కొన్నారు. బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు, తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగొనేందుకు ఏటా ‘ఆపరేషన్ స్మైల్’, ‘ఆపరేషన్ ముసాన్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా మహిళా, శిశు సంక్షేమ, పోలీసు, కార్మిక, శిశు సంరక్షణ శాఖల అధికారులతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో జనవరిలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో 70 మంది బాలబాలికలకు విముక్తి కల్పించామని, వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు.