మరికొద్ది గంటల్లో ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది.. ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.. రోజుల తరబడి నెలకొన్న ఉత్కంఠకు తెరపడనున్నది.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలో వేర్వేరుగా ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ పరిధిలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగనున్నది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. లెక్కింపునకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున టేబుళ్లు ఏర్పాటయ్యాయి. ఖమ్మం రూరల్ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పరిశీలించారు. పాల్వంచ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ వినీత్ సందర్శించారు. ప్రక్రియపై అధికారులకు పలు సూచనలిచ్చారు.
ఖమ్మం, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఉభయ జిల్లాల అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు వేర్వేరుగా జరగనుండటంతో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సమర్ధవంతంగా చేశారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు చెందిన ఓట్లను ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఇందుకోసం కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేశారు. నవంబర్ 30న పోలింగ్ పూర్తి కావడంతో డిసెంబర్ 1 ఉదయం నాటికి ఐదు నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను భారీ భద్రత మధ్య ఖమ్మంలోని ఓట్ల లెక్కింపు కేంద్రమైన చైతన్య ఇంజినీరింగ్ కళాశాలకు తరలించి స్ట్రాంగ్రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్రూంల వద్ద కలెక్టర్లు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం 8 గంటలకు ప్రారంభంకానున్నది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల ఆధారంగా ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్ధులు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించింది. ఆయా పరిశీలకులు ఇప్పటికే ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు ప్రతి నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతి రౌండ్లో ఆయా అభ్యర్ధులకు వచ్చిన ఓట్లను రిటర్నింగ్ అధికారి పరిశీలకులచే ధృవీకరించిన తర్వాత ఆ రౌండ్ ఫలితాన్ని వెల్లడిస్తారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లతో పాటు వాటి పరిసరాలు క్షుణ్ణంగా కనిపించేవిధంగా సీసీ కెమెరాలను అమర్చి మానిటర్ల ద్వారా అధికారులు పర్యవేక్షణ జరుపుతున్నారు.
లెక్కింపు కేంద్రాల వద్ద డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటలకు 144 సెక్షన్ అమలులో ఉన్నది. ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ బృందంగా ఉంటారు. ఖమ్మం రూరల్ పరధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పరిశీలించారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ వినీత్ సందర్శించారు. అధికారులకు పలు సూచనలిచ్చారు. కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్భందీగా చేయాలని విద్యుత్, తాగునీరు వంటి వాటికి ఇబ్బందిలేకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల ఆధారంగా ఖమ్మం జిల్లాలో వైరా, భద్రాద్రి జిల్లాలో భద్రాచలం ఓట్ల లెక్కింపు త్వరితగతిన ముగిసే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఫలితాలు మొదట వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు నియోజకవర్గాల వారీగా పూర్తికాగానే మెజార్టీ వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొందినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి ధ్రువపత్రం జారీచేస్తారు.
ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓటర్లు 3,22,996 ఉండగా 2,30,724 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 355 పోలింగ్ బూత్లు ఉండగా 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనున్నది. పాలేరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,36,287 ఉండగా 2,14,810 ఓట్లు పోలయ్యాయి. 289 పోలింగ్
బూత్లు ఉండగా 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మధిర నియోజకవర్గంలో మొత్తం 2,21,326 ఓటర్లు ఉండగా 1,94,615 ఓట్లు పోలయ్యాయి. 286 పోలింగ్ బూత్లు ఉండగా 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరడనున్నది. వైరా నియోజకవర్గంలో 1,93,069 ఓటర్లు ఉండగా 1,67,389 ఓట్లు పోలయ్యాయి. 252 పోలింగ్ బూత్లకు 18 రౌండ్లలో లెక్కింపు జరగనున్నది. సత్తుపల్లి నియోజకవర్గంలో 2,43,118 మంది ఓటర్లు ఉండగా 2,12,549 ఓట్లు పోలయ్యాయి. 292 పోలింగ్ బూత్లకు 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఖమ్మం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 12,16,796 ఓటర్లు ఉండగా 10,20,087 ఓట్లు పోలవ్వగా 1456 పోలింగ్ బూత్లకు 102 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం నియోజకవర్గంలో 2,43,846 ఓటర్లు ఉండగా 1,86,347 ఓట్లు పోలయ్యాయి. 253 పోలింగ్ బూత్లకు 18 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. పినపాక నియోజకవర్గంలో 1,98,402 ఓటర్లు ఉండగా 1,58,978 ఓట్లు పోలయ్యాయి. 244 పోలింగ్ బూత్లకు 17 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. ఇల్లెందు నియోజకవర్గంలో 2,19,569 ఓటర్లు ఉండగా 1,76,840 ఓట్లు పోలయ్యాయి. 241 పోలింగ్ బూత్లకు 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,55,961 ఓటర్లు ఉండగా 1,35,501 ఓట్లు పోలయ్యాయి. 184 పోలింగ్ బూత్లకు 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. భద్రాచలం నియోజకవర్గంలో 1,48,661 ఓటర్లు ఉండగా 1,17,447 ఓట్లు పోలయ్యాయి. 176 పోలింగ్ బూత్లకు 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9,66,439 ఓటర్లు ఉండగా 7,75,113 ఓట్లు పోలయ్యాయి. 1,098 పోలింగ్ బూత్లకు 77 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది.