నల్లగొండ ప్రతినిధి, మే28(నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ శాతం తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో 3.97శాతం తగ్గింది. పోలింగ్కు సాయంత్రం 4గంటల వరకే గడువు ఉన్నా… అప్పటికే క్యూలైన్లలో ఉన్న ఓటర్లంతా ఓటు వేసే సరికి కొన్నిచోట్ల సాయంత్రం ఏడు గంటలు కూడా దాటింది. దాంతో 12 జిల్లాల నుంచి తుది ఓటింగ్ వివరాలు రావడానికి సోమవారం అర్ధరాత్రి దాటింది. మంగళవారం ఉదయం ఫైనల్ పోలింగ్ వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ హరిచందన వెల్లడించారు. మొత్తం 72.44శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 78.59శాతం కాగా అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 67.62శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను భారీ బందోబస్తు నడుమ నల్లగొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు. అక్కడ 24గంటల పాటు సీసీ టీవీ కెమెరా పర్యవేక్షణలో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. జూన్ 5వ తేదీ నుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుండగా ప్రధాన అభ్యర్థులంతా పోలింగ్ సరళిపై లెక్కల్లో మునిగి తేలుతున్నారు. 2021 ఎన్నికలతో పోలిస్తే 41వేలపై చిలుకు ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నా సరే ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. అప్పుడు మొత్తం 5,05,565 మంది ఓటర్లు ఉండగా 3,86,320 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 76.41శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉండగా 3,36,005 మంది ఓటర్లు ఓటేయగా 72.44శాతం పోలింగ్ నమోదైంది. మూడేండ్ల కిందట జరిగిన ఎన్నికతో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్ 3.97శాతం తగ్గింది. ఉప ఎన్నికల సమయంలో ఓట్లు నమోదు చేయించుకోవడంలో చూపిన ఉత్సాహం పోలింగ్ రోజున చూపకలేకపోయారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎప్పటిలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 78.59 శాతం ఓటింగ్ జరుగడం విశేషం. ఇది కిందటి సారి కంటే నియోజకవర్గం సగటు ఓటింగ్ను కూడా క్రాస్ చేసింది. ఇక అత్యల్పంగా ఖమ్మంలో 67.62శాతమే పోలింగ్ జరిగింది. రెండో స్థానంలో జనగామలో 76.34శాతం, ఆ తర్వాత వరుసగా సిద్దిపేటలో 76.13శాతం, ములుగులో 74.58శాతం, జయశంకర్భూపాలపల్లిలో 73.62శాతం, నల్లగొండలో 73.29 శాతం, సూర్యాపేటలో 73.15శాతం, వరంగల్లో 72.68శాతం, హన్మకొండలో 72.45శాతం, మహబూబాబాద్లో 72.15శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 69.95శాతం ఓటింగ్ నమోదైంది.
సోమవారం సాయంత్రం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్స్లను ముందుగా ఆయా జిల్లా కేంద్రాల్లోని రిసెప్షన్ కేంద్రాలకు తరలించారు. అక్కడికి అన్ని చేరాక భారీ బందోబస్తు నడుమ రూట్ల వారీగా మంగళవారం తెల్లవారుజాము వరకు నల్లగొండ శివారులోని అనిశెట్టి దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములకు చేరవేశారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థతోపాటు 24 గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్ సిబ్బందితో నిరంతర పహారా కొనసాగేలా చర్యలు చేపట్టారు.
వచ్చే నెల 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కూడా దుప్పలపల్లి గోదాములోనే జరుగనుంది. దాని మర్నాడు 5వ తేదీన అక్కడే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. ముందుగా బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున ఒక బండిల్గా రూపొందిస్తారు. ఇది పూర్తయ్యాక తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఇదే సమయంలో చెల్లని ఓట్ల లెక్క తేలుస్తారు. దీని అనంతరం గెలుపు కోటా అంటే చెల్లిన ఓట్లలో 50శాతం ప్లస్ ఒకటిని ఖరారు చేస్తారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో గెలుపు కోటా ఎవరికీ రాకపోతే దాన్ని చేరుకునే వరకు ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ను పూర్తి చేస్తారు. మొత్తం కౌంటింగ్ పూర్తయ్యే సరికి కనీసం 48 గంటలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ప్రధాన అభ్యర్థులంతా పోలింగ్ సరళిని అంచనా వేస్తూ గెలుపోటములపై సమీక్షల్లో మునిగి తేలాల్సిందే.