ఖమ్మం రూరల్, జూలై 16 : ప్రభుత్వ బడికి తమ వంతు సహాయం అందిస్తానని ముందుకు వచ్చి పిల్లల సౌకర్యార్థం బెంచీలను వితరణ చేశారు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు కౌన్సిలర్ వెంపటి ఉమా వెంకటేశ్వర్లు దంపతులు. 29వ వార్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుమ్మూరు దయాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కౌన్సిలర్ దంపతులను వారు అభినందించారు. సర్కారు బడుల బలోపేతం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సోము వెంకటరెడ్డి, కడప నవీన్, బుర్ర మహేశ్, పలువురు మున్సిపాలిటీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సర్కారు బడికి కౌన్సిలర్ ఉమా దంపతులు బెంచీలు వితరణ