ఖమ్మం, ఫిబ్రవరి 28: ఖమ్మం నగరపాలక సంస్థ ఆదాయాన్ని ఆర్జించే విధంగా బడ్జెట్ రూపొందించినట్లు కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. నగరంలోని కేఎంసీ కార్యాలయంలో బుధవారం కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి పనులు జరిగి నగరం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. పారిశుధ్య కార్మికులు నిబద్ధతతో పనిచేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్పొరేషన్ నిధుల నుంచి వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో 10 శాతం నిధులను గ్రీనరీకి వెచ్చిస్తామన్నారు.
మున్సిపల్ పన్నుల వసూళ్లను అధికారులు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గ్రీనరీకి కేటాయించిన నిధులు ఆ పనులకే వినియోగించాలన్నారు. అద్దెల వసూళ్ల ద్వారా నగరపాలక సంస్థ ఆదాయం పెంపొందించుకోవాలన్నారు. నగరంలో నీటి ఎద్దడికి తావు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్నారు. అనంతరం కౌన్సిల్ 2024-25కు సంబంధించిన రూ.187.86 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఫాతిమా జొహరా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.