భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించడంతో ప్రజలు ఉరుకులు పరుగులతో టెస్ట్లకు పరిగెడుతున్నారు. ఈసారి వైరస్ ఎలాంటి లక్షణాలు లేకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరగడంతో ప్రజలు ఆస్పత్రి బాట పడుతున్నారు. దగ్గు, జలుబు ఉన్నా.. లక్షణాలు కనిపించినా చాలు వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం రోగులు పెద్ద ఎత్తున క్యూ కట్టి మరీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
కొత్త వేరియంట్ వస్తున్నదని వారం రోజుల నుంచి వి స్తృతంగా ప్రచారం కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆస్పత్రుల్లో ప్ర త్యేక వార్డులను ఏర్పాటు చేసి పరీక్షల ప్రక్రియను ప్రా రంభించారు. కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో కరోనా పరీ క్షల కోసం వైరాలజీ ల్యాబ్లో సిబ్బందిని అప్రమత్తం చేసి పరీక్షలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, చలి తీవ్రత నేపథ్యంలో జిల్లాలో నెల రోజుల నుంచి జ్వరాల బారినపడిన వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే కరోనా మ హమ్మారి ప్రబలడంతో ప్రజలు భయపడి పరీక్షల కోసం ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు ముందుగానే మాస్క్లు ధరించి వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. కొత్త వేరియంట్ ప్రమాదం ఎలా ఉంటుందోనని దిగులు చెందుతున్నారు. వైద్యులు మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. కాగా.. జిల్లా ఆస్పత్రితోపాటు భద్రాచలం ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులను అందుబాటులో ఉంచారు.