భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కల నెరవేరింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆదివారం నూతన సచివాలయంలో ఆ ఫైల్పై సంతకం పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల చిరకాల వాంఛను నెరవేర్చారు. జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో ల్యాబ్ టెక్నీషియన్లు 19 మంది, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు 69 మంది, పారామెడికల్ ఆప్తాలమిక్ ఆఫీసర్ ఒకరు, ఫార్మాసిస్టులు 21 మంది.. ఇలా మొత్తం 110 మంది కొలువులు పర్మినెంట్ అయ్యాయి. అలాగే ప్రభుత్వ కాలేజీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల కొలువులూ క్రమబద్ధీకరణకు నోచుకున్నాయి. 20 ఏళ్లుగా ఈరోజు కోసమే వేచి చూస్తున్న కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు కాంట్రాక్ట్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఉద్యోగుల హర్షం..
ఖమ్మం ఎడ్యుకేషన్/కొత్తగూడెం ఎడ్యుకేషన్/ భద్రాచలం, ఏప్రిల్ 30: రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ తొలి సంతకాన్ని కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ ఫైల్పై సంతకం చేశారు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఆవరణలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు బండి వెంకటేశ్వరరావు, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్, వినోద్బాబు, నయీంపాషా, గణేశ్, సాదిక్అలీ, వెంకన్న, కనకచంద్ర, మేరి, అనిత, నాగిని, సునీత, ఉషారాణి, అంజనాదేవి, పవన్, సంతోశ్, బాబూలాల్, లక్ష్మణ్, బండి ఈశ్వర్రావు, అనిల్, అమృతరావు, కొండలరావు, శేఖర్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, దీప పాల్గొన్నారు.