ఖమ్మం సిటీ, మార్చి 2 : ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూల్చుడేనా? రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలనా? లేక రాంబదుల రాజ్యమా? అని రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రశ్నించారు. సోమవారం ఖమ్మం విచ్చేసిన ఆయన వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కాంగ్రెస్ సర్కారు కూల్చిన పేదల ఇండ్ల ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి నగరంలోని టీటీడీసీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనాల్లో తలదాచుకుంటున్న బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులతో మమేకమై జరిగిన ఘటనల గురించి ఆరా తీశారు. మీరు అధైర్యపడకండి, యావత్ తెలంగాణ సమాజం అం డగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విధ్వంసమైన గాజా పట్టణం ఖమ్మంలోని వెలుగుమట్ల వినోభాబావే నవోదయ కాలనీలో కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లను ప్రత్యక్షంగా చూస్తే కరగని మనస్సు ఉండదని చెప్పిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఎనిమిదేండ్ల క్రితం కూలీ నాలీ చేసుకుని సంపాదించుకున్న పదో పరకో పెట్టి ఒక చిన్న గూడు కట్టుకుంటే నేలమట్టం చేయడం అన్యాయమని ధ్వజమెత్తారు. పేదల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వమూ నిలబడజాలదనే సత్యాన్ని ప్రస్తుత పాలకులు గుర్తుంచుకోవాలని హిత వు పలికారు.
అనేక పోరాటాలు, త్యాగాలతో రాష్ర్టాన్ని తెచ్చుకుంది పేదల ఇండ్లను కూల్చడానికా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను దేశానికి రోల్మోడల్గా తీర్చిదిద్దుకుని పునర్నిర్మించుకునే సమయంలో ప్రభుత్వం నాగరిక సమాజం తలదించుకునేలా తప్పు చేసిందన్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా ఎక్కడైతే పేదల ఇండ్లను నేలమట్టం చేశారో, అక్కడే వారికి పట్టాలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్త కోయ చంద్రమోహన్, పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.