ఖమ్మం, ఫిబ్రవరి 29 : విశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంలో ధ్రుమతారు కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు మంత్రి తుమ్మలను కలిసి మెడికల్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణంపై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమైనందున నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ప్రస్తుతం కళాశాల నిర్వహణకు పాత కలెక్టరేట్ భవనాన్ని వాడుతున్నారని, కొత్త భవనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం అందుబాటులో ఉందన్నారు. ఇందు లో కళాశాల భవనం, వసతి గృహం, ప్రిన్సిపాల్ క్వార్టర్స్ నిర్మిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలుపగా.. కలెక్టర్ను సంప్రదించి.. భవిష్యత్ అవసరాలకు సరిపడా నిర్మాణాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. స్థల వైశాల్యంతోపాటు పుర ప్రముఖుల అభిప్రాయాలను సేకరించి అందుకనుగుణంగా నిర్మాణాలు ఉండాలన్నారు. రాష్ట్రంలోనే ప్రముఖ వైద్య కళాశాల అని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దాలని సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు.