Sathupalli | ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సత్తుపల్లి నియోజకవర్గం.. స్వరాష్ట్రంలో తన రూపురేఖలు మార్చుకున్నది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచింది. ఆస్పత్రులను అప్గ్రేడ్ చేస్తూ.. కొత్త దవాఖానలకు భవనాలు నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సాగు భూములను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ కెనాల్ పనులు చివరి దశకు చేరాయి. మన ఊరు-మన బడి కింద పాఠశాలలను ఆధునీకరించడంతోపాటు రహదారులు, కల్వర్టులు, వంతెనలు నిర్మించి అభివృద్ధిని కళ్ల ముందుంచింది.
సత్తుపల్లి, అక్టోబర్ 31 : సత్తుపల్లి.. ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుకు ఆనుకుని ఉన్న నియోజకవర్గం. ఉమ్మడి పాలనలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. అన్నిసౌకర్యాలు ఉన్నప్పటికీ వెనుకబడి ఉంది. నీళ్లు, విద్యుత్ లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చేది. కానీ 2014 స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతూ పలు నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచింది. వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి, పెనుబల్లి, కల్లూరు మండలంలో నూతన ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మరోపక్క బుగ్గపాడులో రూ.150కోట్లతో ఫుడ్పార్కు నిర్మించి రైతులకు అవసరమైన అన్ని ఉత్పత్తులను స్టోర్ చేసుకునేందుకు, విక్రయించుకునేందుకు అన్ని హంగులతో ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పండ్ల తోటలు విస్తారంగా ఉండటంతో మండల పరిధిలోని బుగ్గపాడులో 2016 నవంబర్ 13న ఐటీ, పురపాలకశాఖామంత్రి కేటీఆర్ రూ.150 కోట్లతో ఫుడ్పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 203 ఎకరాలను ఫుడ్పార్కు ఏర్పాటుకు రైతుల వద్ద నుంచి భూములు సేకరించి పూర్తిస్థాయి పనులు చేపట్టి ప్రారంభానికి సిద్ధం చేశారు. ఇప్పటికే 60 ఎకరాల్లో ఫుడ్పార్కుకు అనుసంధానంగా పరిపాలన భవనాలు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాకింగ్ గోడౌన్, ట్రీట్మెంట్ ప్లాంట్, వేబ్రిడ్జి, విద్యుత్ సబ్స్టేషన్, ప్రహరీ, సెంట్రల్ లైటింగ్, డివైడర్లతో కూడిన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ప్లాంట్ నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 55 ఎకరాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ ఫుడ్పార్కును అతిత్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫుడ్పార్కు ప్రారంభమైతే 30వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.
విద్యాభివృద్ధి కోసం తొలి విడతలో మన ఊరు-మనబడి కింద రూ.25 కోట్లతో పాఠశాలలను ఆధునీకరించారు. అదేవిధంగా సత్తుపల్లిలో ఒక పాలిటెక్నిక్, ఒక నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేయగా నర్సింగ్ కళాశాల ఈ ఏడాది నుంచే ప్రారంభంకానుంది. అదేవిధంగా ఏడు రెసిడెన్షియల్ పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. సత్తుపల్లిలో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి సొంత నిధులు రూ.2కోట్లతో నూతన లైబ్రరీ నిర్మాణం చేపట్టగా అది పూర్తికావచ్చింది. అదేవిధంగా పట్టణంలోని జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని కూడా పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు ఆయన హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులు సత్తుపల్లిలో శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సత్తుపల్లి మండలం బుగ్గపాడు, యాతాలకుంట, రుద్రాక్షపల్లిలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.10.50లక్షల నష్టపరిహారం అందించి కెనాల్ పనులను చురుకుగా చేపట్టారు. టన్నెల్ నిర్మాణాలు కూడా చివరిదశకు చేరుకున్నాయి.
సత్తుపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రోడ్లు, డ్రైనేజీలు, బ్రిడ్జి నిర్మాణాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. 2014 నుంచి 2023 వరకు సుమారు రూ.734కోట్లతో బీటీ, సీసీ రోడ్లతో పాటు వంతెనలను నిర్మించారు. దీంతో అంతర్గత రహదారులతో గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తప్పాయి.
నియోజకవర్గంలోని కల్లూరు మండల కేంద్రంలో 2018లో నూతన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆర్డీవో కార్యాలయంతో పాటు ఇరిగేషన్ ఎస్ఈ, ఏసీపీ కార్యాలయాలు సైతం నిర్మిస్తున్నారు. రూ.3.50 కోట్లతో క్రీడాకారుల కోసం మినీ స్టేడియం నిర్మించారు. రూ.2 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మాణానికి సైతం శ్రీకారం చుట్టారు.
వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో పంటపెట్టుబడిసాయం కింద 89929 మంది రైతులకు రూ.793.50కోట్లు రైతుబంధు ద్వారా పంపిణీ చేశారు. అదేవిధంగా మిషన్కాకతీయ ద్వారా నియోజకవర్గంలో ఫేజ్-1, 2, 3, 4లలో రూ.78కోట్లతో 1290 చెరువులను అభివృద్ధి చేశారు. అదేవిధంగా మండలంలో పెద్ద చెరువు అయిన బేతుపల్లి చెరువుకు రూ.12కోట్లు కేటాయించి కాలువల పూడిక తీయించి బేతుపల్లి చెరువు అలుగు ద్వారా ఎన్టీఆర్ ప్రత్యామ్నాయ కాలువ ద్వారా సత్తుపల్లి, వేంసూరు మండలంలోని 10వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ వేంసూరు మండలంలోని 54 చెరువులకు నీటిని మళ్లిస్తున్నారు. పామాయిల్ సాగు పెరిగిన నేపథ్యంలో వేంసూరు మండలం కల్లూరుగూడెంలో 25 ఎకరాల భూమిని ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించగా ఇప్పటికే ఆయిల్ఫెడ్ అధికారులు స్థలం చుట్టూ పెన్సింగ్ వేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సత్తుపల్లిలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి స్థానంలో రూ.35 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి వైద్య ఆరోగ్యశాఖామంత్రి హరీష్రావు శంకుస్థాపన చేయగా ఇప్పటికే భవన నిర్మాణం పూర్తయి త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా కల్లూరులోని రూ.10 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, పెనుబల్లి మండల కేంద్రంలో రూ.8.50 కోట్లతో అదనపు గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి తోడు వేంసూరు మండలంలో రూ.22 లక్షలు, తల్లాడ మండలం రూ.33 లక్షలతో పీహెచ్సీల నిర్మాణం జరిగింది. మరో రూ.5 కోట్లతో 45 పల్లె దవాఖానలు, 21 బస్తీ దవాఖానలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ రోగులకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు.
సత్తుపల్లి పంచాయతీ 2005-06లో నగరపంచాయతీగా ఆవిర్భవించింది. 2019లో గ్రేడ్-3 పురపాలక సంఘంగా మారడంతో ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పురపాలకశాఖామంత్రి కేటీఆర్ సహకారంతో 2014 నుంచి 2023 వరకు సుమారు రూ.800కోట్లతో పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు 22 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, నాలుగున్నర కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, ఐదున్నర కిలోమీటర్ల డ్రైనేజీలను నిర్మించారు. అదేవిధంగా రూ.3.50కోట్లతో నూతన మునిసిపాలిటీ భవనం, రూ.11.50లక్షలతో 100 అడుగుల జాతీయ జెండా, రూ.9లక్షలతో జాతీయ చిహ్నం, రూ.30లక్షలతో అంబేద్కర్ విగ్రహం, రూ.9లక్షలతో సెంట్రల్ లైటింగ్, ఎల్ఈడీ దీపాలు, రూ.12.50లక్షలతో పబ్లిక్ టాయిలెట్లు, రూ.4.50కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మించారు. అదేవిధంగా పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు వేంసూరు రోడ్లో 375 ఎకరాల్లో రూ.2 కోట్లతో నీలాద్రి అర్భన్ పార్కును నిర్మించి ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నారు. పట్టణ శివారులో వేశ్యకాంతల చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.5 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.5కోట్లతో మినీ స్టేడియం, రూ.2.50 కోట్లతో అధునాతన దోభీఘాట్, రూ.2 కోట్లతో షాదీఖానా పనులకు శంకుస్థాపన చేయగా పనులు జరుగుతున్నాయి. కల్లూరు, వేంసూరు, పెనుబల్లి మండల కేంద్రాల్లో సైతం షాధీఖానా భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. రూ.2.50 కోట్లతో యాదవ, బ్రాహ్మణ, పద్మశాలి, జంగాలు, తాపీ వర్కర్స్ కోసం కల్యాణ మండపాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు.