రఘునాథపాలెం, సెప్టెంబర్ 22 : కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తండాలను అభివృద్ధి చేసి నగరాలకు దీటుగా సౌకర్యాలను సమకూర్చడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్, చెరువు కొమ్ము తండాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో రూ.1.31కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ నగర్లో ఏర్పాటు చేసిన సభనుద్దేశించి మంత్రి మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు.
గతంలో గ్రామాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో.. మళ్లీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ సర్కార్లో పునావృతం కాకూడదనే ఉద్దేశంతో అవసరమైన చోట సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో కోతల్లేని విద్యుత్ను అందించడంతోపాటు మిరుమిట్లు గొలిపే కాంతులను అందించాలని గ్రామగ్రామాన హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పల్లెల్లో పారిశుధ్య సమస్య, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, జెడ్పీ సీఈవో వీవీ అప్పారావు, జడ్పీటీసీ మాలోతు ప్రియాంక, పీఆర్ ఈఈ కేవీకే శ్రీనివాస్, తహసీల్దార్ థామస్ విల్సన్, ఎంపీడీవో రామకృష్ణ, ఆయా గ్రామాల సర్పంచ్లు కాంపాటి లలిత, బానోతు మంగమ్మ, ఎంపీటీసీ ఉప్పెర్ల వనజారాణి, మాజీ జడ్పీటీసీ కుర్రా భాస్కర్రావు, వైస్ ఎంపీపీ గుత్తా రవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఆత్మ చైర్మన్ లక్ష్మణ్నాయక్, బానోతు దేవేందర్, కొండల్రావు, చెరుకూరి ప్రదీప్, కాంపాటి రవి, సాదిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.