మామిళ్లగూడెం, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న కానిస్టేబుల్స్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ శుక్రవారం తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మొత్తం 105 కేంద్రాల్లో 39,551 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఖమ్మం పరిసర ప్రాంతాల పరిధిలోని 89 కేంద్రాల్లో 31,415 మంది అభ్యర్థులు, సత్తుపల్లిలోని 16 కేంద్రాల్లో 8,136 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్లు పూర్తి చేశారన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకొనే విధంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాల్సి ఉంటుందన్నారు. పరీక్ష నిబంధనలు హాల్టికెట్లో ఉన్నాయని, పరీక్ష గదిలోకి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు.
కేంద్రాల వద్ద144 సెక్షన్..
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు. ఈ ఆంక్షలు అమలులో ఉంటున్నందున ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష కేంద్రాల సమీపంలో 500 అడుగులలోపు ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూదని స్పష్టం చేశారు. పరీక్ష సమయంలో సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.