సత్తుపల్లి, మార్చి 26: మున్సిపాలిటీలోని ఎన్టీఆర్నగర్ 8వ వార్డు కౌన్సిలర్ షేక్ చాంద్పాషాపై సోమవారం రాత్రి ఎన్టీఆర్నగర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. సత్తుపల్లిలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న చాంద్పాషా రాత్రి షాపు బంద్ చేసి బైక్పై ఇంటికి వెళ్తుండగా వేంసూరు రోడ్లోని నీలాద్రి అర్భన్పార్కు ఎదుట కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పాషా వాహనాన్ని అడ్డుకొని దాడికి దిగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని పాషాను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ ఆసుపత్రికి వెళ్లి చాంద్పాషా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చాంద్పాషాపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖండించారు. కాంగ్రెస్ నాయకులు చాంద్పాషాను చంపేస్తామంటూ బెదిరించడం అమానుష చర్యగా అభివర్ణించారు. దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెనుబల్లి, మార్చి 26: సత్తుపల్లి మున్సిపల్ వార్డు కౌన్సిలర్ షేక్ చాంద్పాషాపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంపై పెనుబల్లి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం తీవ్రంగా ఖండించారు. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని, అధికారం శాశ్వతం కాదనే సంగతి గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, కార్యదర్శి భూక్యా ప్రసాద్, ఎంపీపీ లక్కినేని అలేఖ్యవినీల్, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, వైస్ఎంపీపీ నరుకుళ్ల కస్తూరి తదితరులు దాడిని ఖండించారు.
వేంసూరు, మార్చి 26: సత్తుపల్లి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ చాంద్పాషాపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు ఇలానే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఖండించిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలా వెంకటరెడ్డి, పార్టీ కార్యదర్శి గొర్ల సంజీవరెడ్డి, జడ్పీటీసీ మారోజు సుమలత, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.
షేక్ చాంద్పాషాపై జరిగిన దాడి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఫోన్లో చాంద్పాషాను పరామర్శించారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటామంటూ పాషాకు భరోసా కల్పించారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.