ఖమ్మం రూరల్, మే 21 : రైతులు తమ మొక్కజొన్న చేలలోని వ్యర్థాలకు నిప్పంటించడంతో ప్రమాదవశాత్తు గాలికి మంటలు వచ్చి ధాన్యం బస్తాలకు అంటుకొని దగ్ధమయ్యాయి. ఈ ఘటన రూరల్ మండలం తీర్థాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రాంతంలోని రైతులు తమ మొక్కజొన్న చేలలోని వ్యర్థాలను పోగుచేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆ మంటలు పక్కనే ఉన్న కొనుగోలు కేంద్రంలోని రైతుల ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి.
గమనించిన రైతులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. సకాలంలో ఫైరింజన్ రాకపోవడంతో సుమారు వంద బస్తాల మేర ధాన్యం కాలిపోయింది. రూ.లక్ష మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నామని తెలిపారు. ఇలా అనుకోని ప్రమాదాలు జరగడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించాలని రైతులు కోరారు.