జూలూరుపాడు/ అశ్వాపురం/ మణుగూరు టౌన్/ కొత్తగూడెం టౌన్, మే 15 : ‘తరుగు పేరుతో అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తారా?’ అంటూ సీపీఐ నేతలు, దాని అనుబంధ రైతు సంఘం నాయకులు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్షకులకు నష్టం జరగకుండా పంటల సేకరణ ఎందుకు చేయలేరని నిలదీశారు. ఆరుగాలం కష్టించి అన్నదాతలు పండించిన పంటల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రైతుల నుంచి ధాన్యం, మక్కల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సీపీఐ, దాని అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ‘అన్నదాతలు చెమటోడ్చి పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే సాకులు పేరుతో వారి కంట కన్నీళ్లు తెప్పిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. తరుగు పేరుతో రైతుల నుంచి అదనంగా సేకరించిన ధాన్యానికి లెక్కగట్టి దాని పైకాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరవాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.