ఖమ్మం, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండొద్దని, ఆకలితో వచ్చి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటూ అవస్థలు పడొద్దని అప్పటి సీఎం కేసీఆర్ ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఉదయం అల్పాహారం అందించి వారి ఆకలి తీర్చడంతోపాటు ఎదుగుదలకు దోహదపడే విధంగా పోషకాహారం అందించారు. 2023 అక్టోబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ఎంపిక చేసి.. తర్వాత మరికొన్ని పాఠశాలలకు విస్తరించి పథకాన్ని అమలు చేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. అయితే ఇటీవల అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి ఫుల్స్టాప్ పెట్టింది. విద్యార్థుల ఆకలిని ఏమాత్రం పట్టించుకోకుండా అల్పాహారాన్ని ఆపేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖమ్మంజిల్లాలో మొత్తం 22 స్కూళ్లలో సీఎం బ్రేక్పాస్ట్ పథకాన్ని అమలుచేశారు. అత్యధికంగా ఖమ్మం నగరంలో 14 స్కూళ్లలో నిర్వహించారు. రోటరీనగర్ హైస్కూల్, రోటరీనగర్ ప్రాథమిక పాఠశాల, నయాబజార్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జీపీఎస్ బొక్కలగడ్డ, ఎన్ఎస్సీ కాలనీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జీసీఎస్ బుర్హాన్పురం, జీపీఎస్ రమణగుట్ట, జీహెచ్ఎస్ రిక్కాబజార్, గాంధీనగర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, జీపీఎస్ జూబ్లీపుర, జీపీఎస్ గుట్టలబజార్ స్కూల్స్ ఉన్నాయి. వీటితోపాటు ముదిగొండలోని ఎంపీపీఎస్ బాణాపురం, సత్తుపల్లిలోని ఎంపీపీఎస్ సత్తుపల్లి, వైరాలోని సీపీఎస్ వైరా, ఎర్రుపాలెంలోని ఎంపీపీఎస్ బనిగండ్లపాడు, కూసుమంచిలోని జడ్పీహెచ్ఎస్ పాలేరు, ఖమ్మం రూరల్లోని జడ్పీహెచ్ఎస్ జలగంనగర్, మధిరలోని ఎంపీపీఎస్ బాలికల పాఠశాల, తిరుమలాయపాలెం యూపీఎస్, దమ్మాయిగూడెం పాఠశాలలున్నాయి. వీటిలో 20 స్కూల్స్లో మధ్యాహ్న భోజనం అందించే ఏజెన్సీల ద్వారా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అందించగా, ఖమ్మంలోని రోటరీనగర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు మాత్రం వరంగల్లోని అక్షయపాత్ర ఏజెన్సీ ద్వారా అందిస్తోంది. అయితే ప్రస్తుతం రోటరీనగర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మినహా మిగిలిన పాఠశాలల్లో అల్పాహార పథకం నిలిచిపోయింది.
సీఎం బ్రేక్పాస్ట్ పథకం అమలు చేసినప్పుడు విద్యార్థులు సమయానికి కంటే ముందుగానే పాఠశాలకు చేరుకోవడం, తరగతి గదుల్లో ఉత్సాహంగా పాఠాలు వినడం వంటివి కనిపించేవి. ఈ పథకం వల్ల విద్యార్థులకు పోషకాహారంతోపాటు పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. పథకం ఆగిన తర్వాత పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు నిరుత్సాహపడ్డారు. ఆకలితో పాఠాలు వినే రోజులు మళ్లీ వచ్చాయని బాధపడుతున్నారు.. అల్పాహారం అందించాలని అధికారులను కోరుతున్నారు.
ఖమ్మం జిల్లాలో అత్యధిక స్కూల్స్లో సీఎం బ్రేక్పాస్ట్ పథకాన్ని ఆపేసి విద్యార్థుల ఆకలితో విద్యాశాఖాధికారులు ఆడుకుంటున్నారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం నిర్వాహకులు అధికారుల మౌఖిక ఆదేశాలతో బ్రేక్పాస్ట్ పథకం ఆగిందని పేర్కొంటుండగా, అధికారులు మాత్రం ప్రధానోపాధ్యాయులు అల్పాహారానికి విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని, మధ్యాహ్న భోజన నిర్వాహకులు అల్పాహారం అందించట్లేదని పేర్కొనడం గమనార్హం. మధ్యాహ్న భోజన నిర్వాహకులు అల్పాహారం అందించకపోతే ఏవైనా కారణాలరీత్యా వారి నుంచి వివరణ తీసుకోవడం లేదా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఇవేమీ లేకుండా బాధ్యత లేకుండా ఏజెన్సీ వాళ్ళు సరఫరా చేయడం లేదంటున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహాలో సకల సదుపాయాలు కల్పించేందుకు మన ఊరు- మన బడి ద్వారా రూ.కోట్లు ఖర్చుచేసింది. దీనిలో భాగంగా విద్యార్థులకు వేడివేడి అన్నం అక్కడే పాఠశాలల్లో వండేందుకు అనువుగా కిచెన్ షెడ్లు నిర్మించింది. వాటిని ప్రస్తుతం పాఠశాలల్లో వంట చేసేందుకు కాకుండా స్టోర్రూమ్లుగా వినియోగిస్తున్నారు.
విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలని పాఠశాల హెచ్ఎం చెప్పారు. గత ఏడాది 40 రోజులపాటు విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన విధంగా అల్పాహారం అందించాం. ఇప్పటివరకు ఆ బిల్లులు రాలేదు. అందుకే పాఠశాలలో అల్పాహారం ఆపివేశాం.
మేము బడికి వెళ్లగానే టిఫిన్ పెట్టేవారు. మా అమ్మవాళ్లు పనికి వెళ్లేందుకు అన్నం వండుకున్నా.. మేము మాత్రం బడికి వెళ్లి టిఫిన్ తినేవాళ్లం. మధ్యాహ్న భోజనం పెట్టేవరకు ఆకలి అయ్యేదికాదు. ఎందుకో బడిలో ఇప్పుడు ఉదయం టిఫిన్ పెట్టడం లేదు. దీనివల్ల చాలా మంది పిల్లలు బడికి రావడం లేదు. మళ్లీ బడిలో పిల్లలకు టిఫిన్ పెట్టేలా చూడండి.
సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం కింద గతంలో చాలా రోజుల వరకు మా బడిలో టిఫిన్ పెట్టారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి పెట్టడం లేదు. ఉదయమే బడికి వెళ్తుంటే బాగా ఆకలేస్తోంది. టిఫిన్ పెడితే బాగుండు అని అనిపిస్తుంది. మా సార్కు ఈ విషయం చెబితే పెట్టిస్తామన్నాడు. కానీ.. పెట్టడం లేదు. మాకందరికి మళ్లీ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం కింద టిఫిన్ పెట్టాలి.
గత ఏడాది నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం కింద విద్యార్థులకు టిఫిన్ వండి పెడుతున్నాం. ప్రస్తుతానికి బిల్లులు రాకపోవడంతో 15 రోజుల నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేశాం. బిల్లులు రాకపోవడంతో పిల్లలకు వంట చేయడం కష్టంగా ఉంది. అప్పులు పెరుగుతున్నాయి. మాకు బిల్లులు ఇస్తే వంటలు వండిస్తాం. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మళ్లీ వండి పెట్టాలంటే బిల్లులు ఇస్తేనే కొనసాగిస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ఎత్తివేసింది. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిలిపివేసింది. ఆ పథకాన్ని వెంటనే తిరిగి ప్రవేశపెట్టాలి.
విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కొనసాగిస్తే చాలా బాగుంటుంది. పేదపిల్లలకు ఇండ్లల్లో అంత పొద్దున్నే భోజనాలు అవ్వవు.. అల్పాహారం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగపడింది. అల్పాహారం తీసుకోవడం వలన బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. ఖాళీ కడుపుతో చదువుకునే విద్యార్థులు చదువులో కొంత వెనుకబడడం గమనించాం. బ్రేక్ఫాస్ట్ కొనసాగిస్తే విద్యార్థుల ఆకలి తీరుతుంది.
విద్యార్థులకు అందించిన అల్పాహారం చాలా బాగుండేది. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేసినప్పుడు విద్యార్థులు సమయం కంటే ముందుగానే స్కూల్కి చేరుకునేవారు. గతంలో ప్రార్థన సమయంలో కొందరు విద్యార్థులు స్పృహ తప్పేవారు, అల్పాహారం పథకం అమలప్పుడు అలాంటి సంఘటనలు లేవు. పాఠశాలలో 856 మంది ఉంటే రోజు సుమారు 720 మందికిపైగా అల్పాహారం స్వీకరించేవారు.
గత ప్రభుత్వ హయాంలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం పెట్టారు సక్సెస్ అయింది. కానీ ఇలాంటి పెద్ద స్కూల్లో బడ్జెట్ రాకపోతే వంట వాళ్లు చేయలేరు కదా.. అందుకే వాళ్లు బంద్ చేశారు. పేదవారు చదువుకునే పాఠశాలలకు టిఫిన్ పెడితే ఎక్కువ మంది పిల్లలు బడికి వచ్చే అవకాశం ఉంటుంది. పథకాన్ని కొనసాగించాలి.