బూర్గంపహాడ్, సెప్టెంబర్ 3: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పినపాక నియోజకవర్గం సమగ్రాభివృద్ధి సాధించిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. బూర్గంపహాడ్ మండలంలో కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 20 కుటుంబాల వారు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్ ఆధ్వర్యంలో మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ రేగా సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. పాత, కొత్త నాయకులందరూ కలిసి పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు షేక్ అన్వర్, స్వప్న, గోనెల నాని, పూర్ణ, సోము లక్ష్మీచైతన్యరెడ్డి పాల్గొన్నారు.
ఎన్పీ రెడ్డిపాలెం నుంచి మరికొందరు..
బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన సర్పంచ్ భూక్యా శ్రావణి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ప్రభుత్వ విప్ రేగా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు షేక్ అనీఫ్, ఖాసీం, జహీర్, అఫ్రోజ్, ఎస్కే మీరా తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ఎడమకంటి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.