ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 12 : పోషక పదార్థాలతోనే తల్లి, పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ మాలతి, మున్సిపల్ కౌన్సిలర్ సత్యవతి అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు నాయుడుపేటలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ మహా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన సూపర్వైజర్, కౌన్సిలర్లు టీచర్లు ఏర్పాటు చేసిన పోషక పదార్థాల ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన అంగన్వాడీ లెవెల్ మానిటరింగ్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారానే సాధ్యపడుతుందన్నారు.
తాజా కూరగాయలు, కూరలు, గుడ్లు పప్పు దినుసులను తప్పనిసరి తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో అమలు జరుగుతున్న ఆరోగ్యలక్ష్మి పథకాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు, కేంద్రాలలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిచే అందుతున్న వైద్య సేవలను సైతం పొందాలని వారు సూచించారు. చిన్నారులకు టీచర్లు సూచించిన విధంగా బాలమృతం ఇవ్వడంతో మంచి ఆరోగ్యం అందుతుందని, అంగన్వాడీ కేంద్రాలలో ఆంగ్ల బోధనతో పాటు, ఆరోగ్యం సుసాధ్యమన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఎన్ఎం అనురాధ, అంగన్వాడీ టీచర్లు పి.విజయలక్ష్మి, పి.సరోజిని, పి.సరితా బాయి, ఆశా కార్యకర్తలు పుల్లమ్మ, ఆర్పీలు వెంకటలక్ష్మి, స్వరూప, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

‘పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’