ఖమ్మం, మార్చి 4: ‘మన ఊరు/ బస్తీ – మన బడి’లో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం 53వ డివిజన్ ఎన్నెస్పీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.57.38 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారని, తద్వారా కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారని కొనియాడారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో నేటి విద్యార్థులదే కీలక పాత్ర అన్నారు. ‘మన బడి’ పనులను కలెక్టర్ వీపీ గౌతమ్ సత్వరం పూర్తి చేయించారన్నారు. నగరంలోని 26 పాఠశాలల్లో పనులు చేపట్టగా ఇప్పటికే 10 చోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నారన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు ప్రభుత్వ బడుల్లో చేపట్టిన పనులను ఒక్కసారి పరిశీలించాలని హితవు పలికారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ‘మన బడి’కి తొలివిడతగా 426 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. వీటిలో 50 శాతం పాఠశాలల్లో ఈ నెలలోనే పనులు పూర్తవుతాయని అన్నారు. ‘మన ఊరు – మన బడి’లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం ఆనందాన్నిచ్చిందన్నారు. విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి పనులను ఇటీవల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. అనంతరం మంత్రి పువ్వాడ, కలెక్టర్, కేఎంసీ కమిషనర్, మేయర్లను కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఈవో సోమశేఖరశర్మ, బీఆర్ఎస్ నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, శరత్, కన్నం ప్రసన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.