ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్పాం సాగుకు హబ్గా మారనున్నది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల రైతులు పెద్దఎత్తున ఆయిల్పాం సాగును చేపడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలం కల్లూరిగూడెం వద్ద పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది. రూ.250 కోట్లతో 45 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నది. ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యేలా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. ఆయిల్ఫెడ్కు ప్రభుత్వం భూమిని సైతం అప్పగించింది. తొలుత ఫెన్సింగ్ నిర్మాణం పూర్తిచేశాక ఇతర పనులను ప్రారంభించనున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీ ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేటలో ఒకటి, దమ్మపేట మండలం అప్పారావుపేటలో మరో ఫ్యాక్టరీలో ఇప్పటికే పామాయిల్ ఉత్పత్తి జరుగుతున్న విషయం విదితమే.
ఖమ్మం, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేకమంది రైతులు ఆయిల్పాం పంట సాగుపై దృష్టి సారించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుండడంతో భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట సాగవుతున్నది. ఇక ఖమ్మం జిల్లా రైతులు సైతం కొంతకాలంగా ఆయిల్పాం సాగుపై అధికంగా ఆసక్తి చూపడం, లక్షలాది ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో జిల్లాలో సైతం పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రైతుల నుంచి అనేక సంవత్సరాలుగా వస్తున్న డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషి, రైతుల కోరిక మేరకు రూ.250 కోట్ల వ్యయంతో 45 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో వేంసూరు మండలం కల్లూరిగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించింది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కల్లూరిగూడెంలో గల ప్రభుత్వ భూమిని ఆయిల్ఫెడ్కు ఇచ్చింది. ఆయిల్ఫెడ్ నిర్మాణ పనుల కోసం టెండర్లు సైతం ఆహ్వానించింది. ఫెన్సింగ్ పూర్తిచేశాక ఇతర పనులను ప్రారంభించనున్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో అత్యంత శక్తివంతమైన యంత్రాలను ఇండోనేషియా నుంచి కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఆయిల్ఫెడ్ అధికారులు ఇండోనేషియాను సందర్శించి పామాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన మిషనరీ కొనుగోలు, వాటి శక్తి, సామర్థ్యాలు, అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన వివరాలను సేకరించారు.
ఈ సంవత్సరం మార్చి నెలలో నిర్మాణ పనులు ప్రారంభమై 2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు వేంసూరు, పెనుబల్లి మండలాల్లో ఆయిల్పాం సాగును మరింత పెంచేందుకు రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఆయిల్పాం మొక్క రెండు సంవత్సరాల్లో పెరిగి గెలలు వేసే స్థితికి వచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా అప్పటివరకు ఫ్యాక్టరీ సైతం అందుబాటులోకి వచ్చేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వేంసూరు, పెనుబల్లి మండలాల్లో ఇప్పటికే ఆయిల్పాం సాగు విస్తృతంగా కొనసాగుతున్నా ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యే నాటికి ఈ సాగును మరింత పెంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకుగాను ఆయిల్పాం సాగుచేసే రైతులను సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
ఆయిల్పాం మొక్కలను ప్రత్యేక నర్సరీల్లో ప్రభుత్వమే పెంచి సబ్సిడీతో రూ.20లకే అందజేస్తున్నది. సత్తుపల్లి మండలం రేగళ్లపాడులో ఈ నర్సరీని ఏర్పాటు చేశారు. ఆయిల్పాం సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించిన అనుమతులను సైతం ప్రభుత్వం సత్వరం అందిస్తున్నది. ఇప్పటికే వేలాదిమంది రైతులు ఉద్యానవన శాఖ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని సబ్సిడీ ధరకు పొందారు. ఎకరానికి రూ.20 వేలను డ్రిప్ ఇరిగేషన్ కోసం ఉద్యానవనశాఖకు చెల్లిస్తే పూర్తి మెటీరియల్ను ఉద్యానశాఖ అందించి ఆయిల్పాం తోటలో పైపులతో సహా ఏర్పాటు చేస్తున్నది. కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ అందుబాటులోకి రావడం వల్ల అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీలపై కొంతభారం తగ్గనున్నది.
అలాగే పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో ఆయిల్పాం సాగు చేస్తున్న రైతులకు అశ్వారావుపేట వరకు వెళ్లి తమ ఆయిల్పాం గెలలను విక్రయించాల్సిన భారం తప్పడంతోపాటు రవాణా ఖర్చులు సైతం తగ్గనున్నాయి. పామాయిల్ ఫ్యాక్టరీకి గెలలను అందించే రైతులకు రవాణా ఖర్చులను ఆయిల్ఫెడ్ భరించనున్నది. పెనుబల్లి, వేంసూరు మండలాల్లో 10వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయాలని సంకల్పించిన అధికారులు ఈ మేరకు రైతులకు ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఆయిల్పాం సాగు వల్ల కలుగుతున్న ఆర్థిక భరోసాను వివరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ కోసం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పలుసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆయిల్పాం సాగు వేంసూరు, పెనుబల్లి మండలాల్లో విస్తారంగా ఉన్న దృష్ట్యా వేంసూరు మండలంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి నిరంజన్రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్లకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం రూ.250 కోట్లతో వేంసూరు మండలంలోని కల్లూరిగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యాక ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పామాయిల్ సాగు మరింత విస్తరించే అవకాశం ఉంది.
ఆయిల్పాం సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కల్లూరుగూడెంలో రూ.250 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించడం మా అదృష్టం. ఈ ప్రాంత రైతులకు ఆయిల్పాం రవాణా చేసేందుకు దూరాభారం తగ్గనున్నది. రైతులతోపాటు కూలీలకు కూడా పని దొరుకుతుంది. గ్రామాభివృద్ధికి సైతం పామాయిల్ ఫ్యాక్టరీ ఎంతగానో దోహదపడుతుంది.
– గొర్ల శ్రీనివాసరెడ్డి, ఆయిల్పాం రైతు, కల్లూరుగూడెం
కల్లూరుగూడెంలో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీ అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల కంటే పూర్తి అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మిస్తున్నాం. 60 టన్నుల సామర్థ్యంతో ప్రతిరోజు 1000 టన్నుల గానుగ ఆడవచ్చు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కలుగనున్నది. ఏడాదికి రెండు లక్షల టన్నుల గానుగ ఆడుతుంది. పరిసర ప్రాంత రైతులకు దూరం తగ్గి డబ్బు ఆదా అవుతుంది. 2024 చివరి నాటికి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం.
– ఆకుల బాలకృష్ణ, ఆయిల్ఫెడ్ డివిజనల్ మేనేజర్