మామిళ్లగూడెం, మార్చి 15: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబార్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అధికారులు, ఉద్యోగులకు రెండు దశల్లో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాలున్న పాఠశాలల్లో సౌకర్యాల మెరుగునకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా నవీకరణలో భాగంగా 29,745 ఓట్లను తొలగించామన్నారు. ముందస్తుగా నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఓట్లను తొలగించినట్లు చెప్పారు.
నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించామన్నారు. ఈ కెమెరాలను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, హైదరాబాద్లోని ప్రధాన ఎన్నికల అధికారి, ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల అధికారి కార్యాలయాలకు అనుసంధానించినట్లు చెప్పారు.
ఇలా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఢిల్లీ వరకు అనుసంధానించడం అనేది మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలోనే జరిగిందంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసించిందని చెప్పారు. ఈ విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. “ఇక్కడి విధానాన్ని దేశం అనుసరించడం మన జిల్లాకు గర్వకారణం” అన్నారు..
జిల్లావ్యాప్తంగా మూడు నెలలపాటు (జూన్ 30 వరకు) ప్రతి ఒకరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ సూచించారు. పాలేరు రిజర్వాయర్లో నీరు మరో పది రోజుల వరకు మాత్రమే సరిపోతుందన్నారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి తాగునీటిని తీసుకునేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్డ్ (కేఆర్ఎంబీ) అనుమతి అవసరమవుతుందని చెప్పారు. మిషన్ భగీరథ పథకాలు పనిచేస్తున్నాయన్నారు.