మామిళ్లగూడెం, మార్చి 20 : పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలను నియంత్రించడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఎక్సైజ్, వ్యయ నియంత్రణ కమిటీలతో ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, ప్రలోభాల జప్తులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్వేచ్ఛాయుత, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు తమవంతు కృషి చేయాలన్నారు.
బ్యాంకర్లు పెద్ద మొత్తంలో లావాదేవీలు, బల్ లావాదేవీలు, ఒకటి కంటే ఎకువ సంఖ్యలో డిజిటల్ లావాదేవీలపై రోజువారీ నివేదిక సమర్పించాలన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీలలో సీజ్ అయిన వాటికి వెంటనే ఎఫ్ఐఆర్ అయ్యేలా చూడాలన్నారు. పెట్రోల్ పంప్, జ్యూవెల్లరీ యజమానులు రోజువారీ నగదు లావాదేవీలు, ఎంత నగదు, ఎవరి ద్వారా వెళ్తుందో వివరాలు ఇవ్వాలన్నారు.
ఇప్పటివరకు జిల్లాలో రూ.1,69,904 విలువ చేసే మద్యం సీజ్ చేశారని, 21 బెల్ట్ షాపులను సీజ్ చేసి, కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, జిల్లా సహకార అధికారి మురళీధర్రావు, అదనపు డీసీపీ ప్రసాద్రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్రెడ్డి, సీపీవో శ్రీనివాస్, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, బ్యాంకర్లు, ఐటీ, జీఎస్టీ అధికారులు, పెట్రోల్ పంపు యజమానులు పాల్గొన్నారు.