ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 4 : నగరంలోని రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో గల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రహరీ, భద్రతా అంశాలను పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించడంతోపాటు ఎండల దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీఫ్ సూపరింటెండెంట్తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి లోనికి అనుమతించాలని, సెల్ఫోన్లను అనుమతించొద్దని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. లోటుపాట్లు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు.