మామిళ్లగూడెం, ఫిబ్రవరి 6: ప్రజల నుంచి అందిన సమస్యల సత్వర పరిషారానికి ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. ప్రజలు అందించిన వినతులను పరిశీలించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలందరూ వ్వవసాయ భూముల సమస్యలు, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆహార భద్రత కార్డులు తదితర సమస్యలపై వినతులు అందించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, డీఆర్వో శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం రైతుల చెల్లింపులకు రూ.39 కోట్లు విడుదల
జిల్లాలో 2022-23 వానకాలం సీజన్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి చెల్లింపు నిమిత్తం సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.39 కోట్లు జిల్లాకు విడుదలైనట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. విడుదలైన మొత్తం నగదు సంబంధిత రైతుల ఖాతాల్లో మంగళవారం నేరుగా జమ కానున్నట్లు చెప్పారు.
జిల్లాలో 42,101 మంది రైతుల నుంచి రూ.573.87 కోట్ల విలువైన 2,88,618.760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వానకాలం సీజన్లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 31,241 మంది రైతులకు రూ.422.47 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. మిగిలిన రైతులకు రెండు మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు.