మామిళ్లగూడెం, జనవరి 25: దేశ భవిష్యత్తు అంతా ఓటర్ల చేతిలో ఉన్నందున దీనిని అందరూ గుర్తుంచుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హకును సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇటీవలే ఓటరు జాబితా సవరణ పూర్తి చేసి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఉండే నేపథ్యంలో మరోసారి ఓటరు జాబితా సవరణ చేపట్టామన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన పాటను మనమంతా చూశామన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడంలో మనమంతా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై అధికారులు, నూతన ఓటర్లతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన ఓటర్లకు నూతన ఎపిక్ కార్డులను పంపిణీ చేశారు. జిల్లాలో నూతనంగా ఓటు హకు పొందిన యువత దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఎన్నికల్లోనూ తమ ఓటు హకు సక్రమంగా వినియోగంచుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండగానే ఓటు హక్కును నమోదు చేసుకున్నందున వారిని కలెక్టర్ అభినందించారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, డీఆర్వో శిరీష, జిల్లా నోడల్ అధికారి కే.శ్రీరామ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.