రఘునాథపాలెం, జూన్ 7 : బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఆదివారం ఖమ్మం నగరం పాండురంగాపురంలో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్వోలు చేస్తున్న ఇంటింటి సర్వే నిర్వహణ, వివరాల నమోదు, ఓటరు జాబితా సవరణ అంశాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరును గుర్తించి వివరాలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ సర్వేను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయచందర్, గిర్దావర్, జయకృష్ణ, బీఎల్వోలు ప్రమీల, రెహానాబేగం, కళ్యాణి తదితరులు ఉన్నారు.