మధిర రూరల్, జూన్ 6 : ఓటరు జాబితా వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. జాలిముడి గ్రామంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్.. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో బీఎల్వోల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో కచ్చితమైన ధ్రువీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను జూన్ 24 నుంచి జూలై 25 వరకు చేపడతారని, ఈ క్రమంలో డబుల్ ఓట్లు, మరణించిన ఓటర్ల వివరాలను కచ్చితంగా ధ్రువీకరించి, తొలగింపు ప్రక్రియ చేపట్టాలన్నారు.
కచ్చితమైన ఓటరు జాబితా తయారీలో పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని, జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు అభ్యంతరాలు, క్లెయిమ్లపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. కార్యక్రమంలో జాలిముడి సర్పంచ్ శీలం కోటేశ్వరి, ఆర్డీవో శ్రీనివాస్, మధిర తహసీల్దార్ రాంబాబు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.