ఆళ్లపల్లి, ఏప్రిల్ 4 : వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు.
రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 108 వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బంది సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో అనేక మంది క్షతగాత్రులు, గర్భిణులను రోడ్డు సౌకర్యం లేనప్పటికి సరైన సమయంలో జిల్లా వైద్యశాలకు తరలించామని, చాలా మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడినట్లు సిబ్బంది కలెక్టర్కు వివరించారు. దీంతో వారి సేవలను కలెక్టర్ మెచ్చుకున్నారు.