ఖమ్మం, నవంబర్ 23 : జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 45వేల 625 మెట్రిక్ టన్నులు ధాన్యం రాగా తేమశాతాన్ని పరిశీలించి 28వేల 847 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 18వేల 542 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీలో నమోదు చేసిన ధాన్యం వివరాలకు ఉన్న వ్యత్యాసానికి గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, తేమశాతం రాగానే కాంటా వేసి కొనుగోలు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు గన్నిబ్యాగుల సరఫరా చేసుకున్నప్పుడు నాణ్యతను పరిశీలించాలని సూచించారు. రానున్న మూడు వారాల్లో ధాన్యం ఎకువ పరిమాణంలో రానున్నట్లు కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటూ ధాన్యం కొనుగోలు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో ఎస్.సన్యాసయ్య, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, అధికారులు పాల్గొన్నారు.