ఖమ్మం రూరల్, జనవరి 28: సీఎంఆర్ రైస్ డెలివరీకి ప్రభుత్వం ఈ నెల 31 వరకు గడువు ఇచ్చిందని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. అందుకని ప్రభుత్వ లక్ష్యం మేరకు మిల్లర్లందరూ సీఎంఆర్ రైస్ డెలివరీని ఆ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలోని సత్యనారాయణ సిలి అండ్ సార్టెక్స్ రైస్ మిల్లును ఆదివారం ఆయన తనిఖీ చేశారు. వానకాలం సీఎంఆర్ రైస్ డెలివరీ, కేటాయించిన లక్ష్యం, అందించిన రైస్ వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించి రైస్ ఉత్పత్తిలో వేగం పెంచి లక్ష్యం మేరకు సీఎంఆర్ రైస్ డెలివరీ చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో లక్ష్యాలు చేరుకోని రైస్ మిల్లులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వానకాలం పంటకు సంబంధించిన పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ డెలీవరి దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎంఆర్ రైస్ డెలివరీకి ఇకపై గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 3,354.577 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ డెలివరీ చేయాల్సి ఉందన్నారు. లక్ష్యం చేరని మిల్లర్లను బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని హెచ్చరించారు.