ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 13 : జిల్లాలో మాతృ మరణాలను నివారించడంపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాల సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు ప్రసవ సమయాల్లో వివిధ కారణాలతో మరణాలు చోటు చేసుకుంటున్నాయని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. దేశంలో మాతృ మరణాల రేటు 52 శాతం ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో 42, ఖమ్మం జిల్లాలో 45 శాతంగా ఉందన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి 2024 వరకు 9 మరణాలు సంభవించాయని, కారణాలు ఏవైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
ప్రసవానంతరం బాలింతలను 45 రోజులపాటు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో వంద శాతం గర్భిణుల వివరాలను నమోదు చేయాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు జరిగేలా చూస్తూ.. ఐరన్, పోలిక్ మాత్రలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కుటుంబ నియంత్రణ, గర్భిణుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఎంహెచ్వో డాక్టర్ రాములునాయక్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సైదులు, హెచ్వోడీలు, వైద్యాధికారులు, ఆశాలు, మృతుల అటెండెంట్లు పాల్గొన్నారు.