భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద ఎంపికైన జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు పనులు చేయించే విధానంపై సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో డీఆర్డీవో విద్యాచందనతో కలిసి నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్, పీఎస్ ఈడబ్ల్యూఐడీసీ, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 643 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన పనులన్నింటినీ మంగళవారం నుంచి ప్రారంభించి మే నెలాఖరుకల్లా పూర్తి చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు సమర్పించాలన్నారు. తాగునీరు, తరగతి గదుల్లో మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తదితర అంశాలను గుర్తించి పనులు పూర్తి చేయించాలన్నారు. ప్రతి పంచాయతీలో 200 మందికి తగ్గకుండా ఉపాధిహామీ పనులు చేపట్టాలని, తాగునీటి సరఫరాను ప్రతిరోజు పరిశీలించాలన్నారు.
ప్రతి ఇంటికి నీటి సరఫరా జరగాలని ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీలో పీఆర్ ఈఈ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈవో వెంకటేశ్వరచారి, ఆర్అండ్బీ డీఈ నాగేశ్వరరావు, మున్సిపల్ డీఈ రవికుమార్, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ రమేశ్కుమార్, డీపీఎం సెర్ప్ నాగజ్యోతి, రంగారావు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, డీఈలు, ఏఈలు, ఏపీఎంలు, వీవో అధ్యక్షులు పాల్గొన్నారు.