మామిళ్లగూడెం, జూన్ 24: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై మీడియా ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి బుధవారం కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో ముందస్తు ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. బూత్ లెవల్ అధికారులకు శిక్షణ ఇవ్వడంతోపాటు అవసరమైన పత్రాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించి, ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారంలు రెండు అందజేస్తారని, ప్రతి ఓటరు తప్పనిసరిగా వాటిని నింపి తిరిగి ఒక ఫారం బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. ఓటర్లు ఇంటి వద్ద అందుబాటులో ఉండి వివరాలను సక్రమంగా ఎన్యుమరేట్లకు అందించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలు, ఇతర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ఓటర్లు కూడా ఆన్లైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని, లేదా వారి కుటుంబ సభ్యులు సంబంధిత బీఎల్వోకు వివరాలు అందించవచ్చని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఎస్ఐఆర్ ఓటరు జాబితా విడుదల చేస్తామని, ఓటరు పేరు లేకపోవడం, లేదా ఇతర అభ్యంతరాలపై ఆగస్టు 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
అందిన అన్ని అభ్యంతరాలను సెప్టెంబర్ 28 నాటికి పరిష్కరించి, అక్టోబర్ 1న 2026న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ తాజా సమాచారం అందిస్తున్నామని పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో ఎలాంటి వివక్ష ఉండదని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చర్యలు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.