మామిళ్లగూడెం, జూలై 21: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై రోడ్డు భద్రత చర్యలు, ప్రమాదాల నివారణ, సుప్రీంకోర్డు మార్గదర్శకాల అమలు, అనుసరణ నివేదికల సమర్పణ, ప్రమాదాల తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలు, జాతీయ రహదారుల వెంట ఉన్న ఆసుపత్రుల మ్యాపింగ్, ఆక్రమణల తొలగింపు, అత్యవసర స్పందన వ్యవస్థ తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు సహా సంబంధిత అధికారులతో మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీసీకి ఖమ్మం నుంచి కలెక్టర్ దివాకర, సీపీ సునీల్దత్ హాజరయ్యారు. అనంతరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల వెంట అవసరమైన చోట పార్కింగ్ ప్రాంతాలు గుర్తించాలన్నారు. ప్రతి నెలా మూడో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని, రోడ్డు భద్రత చర్యల పురోగతిని సమీక్షించాలని సూచించారు. ఆర్అండ్బీ ఎస్ఈ యుగంధర్రావు, డీఎంహెచ్వో డాక్టర్ రామారావు, ఎన్హెచ్ పీడీ దివ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.