ఖమ్మం కమాన్బజార్, జూలై 15: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. గణన పత్రాల వంద శాతం డిజిటలైజేషన్లో నేతలు చురుకైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అర్హులందరికీ తుది జాబితాలో ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐఆర్ను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు.
ఖమ్మం జిల్లాలో మొత్తం 1,460 పోలింగ్ స్టేషన్లు, 12,43,781 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 8,48,491 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేశామని, ఇది 68.22 శాతం పురోగతికి సమానమని అన్నారు. ఇంకా 3,95,290 మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే డిజిటలైజ్ చేసిన వివరాల్లో సుమారు 72 వేల ఓట్లకు సంబంధించిన అనామలీలను గుర్తించామని, రానున్న రెండు నెలల్లో విచారణ చేపట్టి వాటిని పరిషరిస్తామని తెలిపారు. సుమారు 25 వేల మంది ఓటర్లు అవసరమైన వివరాలు నమోదు చేయకుండానే కేవలం ఎన్యూమరేషన్ ఫారాలను మాత్రమే సమర్పించడంతో వారి ఓట్ల మ్యాపింగ్ జరగలేదని తెలిపారు.
అటువంటి వారికి నోటీసులు జారీ చేస్తామని, నోటీసులు అందిన వెంటనే అవసరమైన ధ్రువపత్రాలు సమర్పిస్తే పరిశీలిస్తామని, అర్హుల పేర్లను తుది ఓటరు జాబితాలో చేర్చుతామని స్పష్టం చేశారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్ సక్రమంగా జరగని వారి వివరాలపై ఎన్నికల అధికారులు సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీచేస్తారని తెలిపారు. ఆ నోటీసులకు నిర్దేశిత సమయంలో స్పందించి అవసరమైన పత్రాలు సమర్పిస్తే వాటిని పరిశీలించి అర్హులైన ప్రతి ఒకరి పేరునూ తుది ఎస్ఐఆర్ ఓటరు జాబితాలో చేర్చుతామని వివరించారు.
అవసరమైన పత్రాల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత శాఖల ద్వారా వెంటనే జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారం అందని ఓటర్లు ఆన్లైన్ ద్వారా కూడా ఫారాన్ని పొందవచ్చని తెలిపారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఎస్డీసీ సదానందం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఎన్నికల విభాగ డీటీ అన్సారీ, ఇతర అధికారులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.