మామిళ్లగూడెం, జూన్ 26: మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ దివాకర టీఎస్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం మమత రోడ్డులోని టాటా సర్వీస్ సెంటర్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్, సీపీ సునీల్దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
విద్యార్థులు, యువత, పోలీస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో రన్లో కలెక్టర్, సీపీ పాల్గొని స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సేవించడం వ్యాధుల కంటే ప్రమాదకరమని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కేవలం అధికారులు మాత్రమే చేయలేరని, ప్రజలంతా సమష్టిగా ఉంటూ అధికారులకు సహకరిస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయన్నారు.
సీపీ సునీల్దత్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్ను అందించాలన్నారు. యువత దృష్టి అంతా తమ జీవిత లక్ష్యంపైనే ఉండాలని, నిషేధిత గంజాయి, డ్రగ్స్కు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినట్లు సమాచారం ఉంటే వెంటనే 1908కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం ప్రజలు, యువత, విద్యార్థులు, అధికారులతో కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై ప్రతిజ్ఞ చేయించారు. ఏసీపీ రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేశ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.