కూసుమంచి, జూలై 17 : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర రైతులకు సూచించారు. పోచారం గ్రామంలో శుక్రవారం పర్యటించిన కలెక్టర్.. క్షేత్రస్థాయిలో పంటల సాగుపై రైతులతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి లభ్యత తక్కువగా ఉంటుందని, వరి వేసిన తర్వాత నీరు అందకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇక యూరియా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి తాత్కాలికమేనన్నారు.
ఇప్పటివరకు 20 వేల బస్తాల యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకుంటే.. అందులో 19 వేల బస్తాలకు పైగా పంపిణీ చేశామని, ఇంకా 800 బస్తాల స్టాక్ ఉందని ఏవో వాణి కలెక్టర్కు వివరించారు. రైతులు పెసర, కంది, మొక్కజొన్న వంటి పంటలు వేసుకొని దిగుబడులు సాధించాలన్నారు. కాగా.. జిల్లాలోనే అత్యధికంగా ఈ మండలంలో వరి వేస్తున్నట్లు సమాచారం అందుకున్న కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. తమ గ్రామంలో కోతుల సమస్య ఎక్కువగా ఉన్నదని, వాటిని తరలించే విధంగా చూడాలని రైతులు కలెక్టర్ను కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సైదులు, ఏవో వాణి, ఏఈవో జానీబాబా, సర్పంచ్ సల్వాది గురుమూర్తి, ఇందుర్తి వెంకటరెడ్డి, రైతులు ఉన్నారు.