ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి గౌతమ్ సూచించారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసన మండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 10వ తేదీన జరగనున్న శాసన మండలి ఎన్నికల పోలింగ్లో ఖమ్మం డివిజన్కు సంబంధించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.
నగరంలో ఖమ్మం రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.
పోలింగ్ కేంద్రం, ఆవరణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉండాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఏసీపీ ప్రసన్నకుమార్, పోలీస్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.