జూలూరుపాడు, మార్చి 31: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. జూలూరుపాడు మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల, పడమటనర్సాపురం గ్రామంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలు, ఆహార నాణ్యత, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో నేరుగా 8వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పుస్తకం చదివించి వారి పఠనా సామర్థ్యాలను పరిశీలించారు.
అనంతరం పాఠశాలలోని ఆర్వో ప్లాంటును పరిశీలించారు. అది పనిచేయడం లేదని, మరమ్మతుకు గురైందని, బయట నుంచి నీళ్లు తెప్పిస్తున్నామని అక్కడి సిబ్బంది కలెక్టర్తో చెప్పారు. వారం రోజుల్లో ఆర్వో ప్లాంటు మరమ్మతు చేయించి వినియోగించాలని ఆదేశించారు. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేచోట ట్యాపులు సరిగా పనిచేయకపోవడంపైనా సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం, పడమటనర్సాపురం బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి తనిఖీలు చేశారు. కిచెన్ స్టోర్ రూంలో వంట కోసం ఉంచిన కూరగాయల్లో కుళ్లినవి, దుర్వాసన వస్తున్నవి ఉండడాన్ని గమనించారు. ‘ఇలాంటి ఆహారం వడ్డిస్తారా?’ అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూలో బీట్రూట్ వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని వడ్డించాలని ఆదేశించారు.
పాఠశాలలోని బయోమెట్రిక్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని, లేకుంటే తొలగించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ యంత్రాలు అలంకార ప్రాయంగా గోడలకు ఎందుకని ప్రశ్నించారు. మెనూ పాటించకపోయినా, పరిశుభ్రతలో నిర్లక్షం వహించినా అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంఈవో జుంకీలాల్, ఎస్వో పద్మజ, ప్రధానోపాధ్యాయురాలు సుభద్ర, ఎంపీవో తులసీరాం తదితరులు పాల్గొన్నారు.