ఖమ్మం సిటీ, ఏప్రిల్ 19: ఖమ్మం మెడికల్ కాలేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన పాత కలెక్టరేట్లో చేపడుతున్న వైద్య కళాశాల ఆదునీకరణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు, సూచనలిచ్చారు. తరగతి గదులు, అనాటమీ విభాగాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైతే ఎక్కువ మంది కార్మికులను పనిలో పెట్టుకోవాలన్నారు.
భవన సముదాయంలోని బ్యాంక్, పోస్టాఫీస్, టీఎన్జీవోస్ కార్యాలయ భవనాలను ఇప్పటికీ ఖాళీ చేయకపోవడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తక్షణం వాటిని ఖాళీ చేయించి వైద్య కళాశాలకు అప్పగించాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ట్రైనీ కలెక్టర్ రాధికా గుప్తా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, డీఎంహెచ్వో మాలతి, జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, టీఎస్ఎంఐడీసీ ఈఈ ఉమామహేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ పాల్గొన్నారు.
24న మంత్రి హరీశ్రావు రాక..
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పలు విభాగాలను ప్రారంభించేందుకు ఈ నెల 24న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రానున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి మేమోగ్రాం భవనం, కంటి ఆపరేషన్లకు సంబంధించిన టాకో మిషన్తో పాటు ఇతర మెషినరీని ప్రారంభించనున్నారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తారు. పర్యటనకు కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయిస్తున్నారు.