మామిళ్లగూడెం, ఏప్రిల్ 10: జిల్లాలో ఈ నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, ఈ దిశగా ప్రణాళికాబద్ధ కార్యాచరణ చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిలతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పది వేల ఇళ్ల గృహ ప్రవేశాలకు లక్ష్యంగా కార్యాచరణ చేసినట్లు తెలిపారు.
అధికారులు లభ్ధిదారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి లక్ష్య సాధనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 9,199 ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్లు వేసినట్లు, 2,018 ఇళ్లు ఫినిషింగ్ పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఏప్రిల్ 10 నాటికి 1,439 ఇళ్లు, ఏప్రిల్ 17 నాటికి 2,794 ఇళ్లు, ఏప్రిల్ 24 నాటికి 2,794 ఇళ్లు, ఏప్రిల్ 30 నాటికి మిగిలిన 2,973 ఇళ్లను గృహ ప్రవేశాలకు పకడ్బందీ కార్యాచరణ చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొదటి విడతగా 16,497 ఇళ్లు మంజూరు చేశామన్నారు. వాటిలో 1,912 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభించలేదని, 2,520 ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయని, మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
వెలుగుమట్లలో మంజూరు చేసిన 311, వివిధ మండలాల్లో మంజూరు చేసిన 101 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించాలని, క్షేత్ర అధికారులు క్రియాశీలకంగా ఉంటూ పనుల్లో రోజువారీ ప్రగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు నిరంతరం సమీక్షలు చేస్తూ పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, హౌసింగ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.