మామిళ్లగూడెం, అక్టోబర్ 17: ప్రభుత్వ అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ ఆదేశించారు. ఖమ్మంలోని కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి అభ్యర్థికి సమాన హకులు ఉంటాయన్నారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఉండవని స్పష్టం చేశారు. ఒక శాసనసభ నియోజకవర్గానికి ఒక అభ్యర్థి గరిష్ఠంగా రూ.40 లక్షలలోపు ఖర్చు చేయవచ్చన్నారు.
సమావేశాలు, సభలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల పంపిణీ, ప్రచార ప్రకటనలు, వీఐపీలు పాల్గొనే బహిరంగ సభలకయ్యే ఖర్చులను నిశితంగా పరిశీలించాలన్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి అభ్యర్థి ఎన్నికల ఖర్చు లావాదేవీల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. ఫ్లెక్సీలపై మద్రణదారుల ఫోన్నంబర్ ప్రింట్ చేయాల్సిందేనన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం ప్రభావం ఉండకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్నాయక్, సహాయ శిక్షణ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా సహకారశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల పాల్గొన్నారు.
నూతన కలెక్టరేట్లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ను మంగళవారం కలెక్టర్ వి.పి.గౌతమ్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూంతోపాటు సీ విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్కు అందిన ఫిర్యాదులపై సిబ్బందిని ఆరా తీశారు. సీ విజిల్ యాప్ ద్వారా 72 ఫిర్యాదులు, 1950 టోల్ ఫ్రీ నంబర్కు 343 కాల్స్ వచ్చాయని సిబ్బంది బదులిచ్చారు. వాటిని సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, సీపీవో ఎ.శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ఉన్నారు.